ఒంగోలు సబర్బన్: జనాభా లెక్కల సేకరణకు ప్రజలు సహకరించాలని జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణను బుధవారం ఒంగోలులో ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పర్యవేక్షించారు. ఫీల్డ్ ట్రైనర్లకు గృహ గణన చేసే విధానం, యాప్లో వివరాల నమోదు, సమాచార సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు పట్టణంలో నాలుగు బృందాలకు క్షేత్ర స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జన గణన అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించడంలో ఎదురయ్యే సమస్యలు, యాప్లో వివరాల నమోదు సమయంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా జనాభా లెక్కల సేకరణ సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని ఫీల్డ్ ట్రైనర్లకు రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా సిబ్బందికి క్షేత్ర స్థాయిలో అవగాహన కోసం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నివాసంలో మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు సేకరించి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్ మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జనాభా లెక్కల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు
ఫీల్డ్ ట్రైనర్లకు క్షేత్ర స్థాయి శిక్షణ


