● రూ.9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం
కనిగిరి రూరల్: పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ ఏవీ రమణకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ 9,49,800 నగదు, 30 గ్రాముల బంగారు సరుడు, ఏపీ 27బీఎం 3997నెంబర్ గల మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనిగిరిలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కనిగిరి శివారులో పొదిలి రోడ్డులోని లారీ ఆఫీసు వద్ద సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సందీప్ కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వడ్డమాను శివారెడ్డి(అంకిరెడ్డి పాలెం, గుంటూరు జిల్లా)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడటంతోపాటు దర్శిలో బైక్ అపరిహించినట్లు నిందితుడు అంగీకరించాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 చోరీ కేసులు నిందితుడిపై నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడి అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు.


