మార్కాపురం ఆర్డీఓగా ప్రభాకర్
మార్కాపురం: మార్కాపురం ఆర్డీఓగా పెంచల ప్రభాకర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా సివిల్ సప్లై డీఎంగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇన్చార్జి సబ్కలెక్టర్గా వ్యవహరిస్తున్న బీ శివరామిరెడ్డిని కడప సోమశిల ప్రాజెక్టుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురం డివిజన్కు ఐఏఎస్ అధికారిని సబ్కలెక్టరుగా నియమించారు. సేదుమాధవన్, రాహుల్మీనా, త్రివినాగ్ సబ్కలెక్టర్లుగా పనిచేశారు. నాలుగు నెలల క్రితం త్రివినాగ్ను బదిలీ చేయగా ఆయన స్థానంలో వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు శివరామిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.
ఒంగోలు సిటీ: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఇంటర్ సెకండియర్ మొదటి పరీక్షకు 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనరల్ విద్యార్థులు 17,807 మందికి గాను 17,231 మంది హాజరుకాగా, 576 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1586 మందికి గాను 1488 మంది హాజరుకాగా, 98 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 6 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డీఈసీ 5 పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ 32 పరీక్ష కేంద్రాల చొప్పున మొత్తం 43 కేంద్రాలను పరిశీలించారు.
మార్కాపురం ఆర్డీఓగా ప్రభాకర్


