
కాసులు పిండేస్తాం!
నెలకు రూ.2.75 కోట్ల దోపిడీ చేస్తున్న పచ్చదండు
రీచ్లో టన్ను ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.800
కూటమి డంపుల్లో రూ.1300 నుంచి రూ.1500
లారీ ఇసుక రూ.52 వేలు, రవాణా ఖర్చులు అదనం
రూ.500 నుంచి రూ.700 వరకూ ఎల్లో ట్యాక్స్
అనధికార ఇసుక స్టాక్ పాయింట్లతో దందా
కేసులు పెడతాం..
ఇతర లారీలు ససేమిరా...
ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలి
ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం కంటే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. ప్రతి మండలంలో ఐదు నుంచి పది మంది లూజు ఇసుక అమ్ముకుని జీవించేవారు. బలవంతంగా వారిని అమ్ముకునే పరిస్థితి లేకుండా చేశారు.
– డాకాల పుల్లయ్య, రైతు సంఘ నియోజకవర్గ కార్యదర్శి
బేస్తవారిపేట:
జిల్లాలో వందలాదిమంది ఇసుక వ్యాపారులున్నారు. ఏళ్ల తరబడి ఇసుక అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సుమారు 400 నుంచి 500 మంది ఇసుక విక్రయాలపై బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్ల నుంచి ఇసుక తెచ్చుకుని అమ్ముకోకుండా వారిపై ఒత్తిడి చేయడం, పోలీసు కేసులతో బెదిరించడంతో పాటు భయాందోళనకు గురిచేశారు. ఇసుక వ్యాపారుల టిప్పర్లను ధ్వంసం చేయడమే కాకుండా రోజుల తరబడి వారి అధీనంలో పెట్టుకుని వేధించారు. దాంతో టిప్పర్ యజమానులు, ఇసుక వ్యాపారులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అయినప్పటికీ పచ్చనేతలు ఊరుకోలేదు. ప్రైవేటు వ్యాపారులు ఇసుక అమ్మడానికి వీళ్లేదని ఆంక్షలు విధించారు. ఎవరైనా ఇసుక తెచ్చుకున్నా తమ ఇసుక స్టాక్ పాయింట్లో, చెప్పిన ధరకే అన్లోడ్ చేయాలని హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక ఇసుక వ్యాపారులు కూలి పనులకు వెళ్తున్నారు. కొందరు మాత్రం పచ్చనేతలతో బేరం కుదుర్చుకుని స్టాక్ పాయింట్కు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
నెలకు రూ.2.75 కోట్ల దోపిడీ...
జిల్లాలో నెలకు 50 నుంచి 65 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా. ప్రతి టన్నుపై టీడీపీ నాయకులు 500 నుంచి 700 రూపాయలు అధికంగా ఎల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు రూ.2.75 కోట్లకుపైగా అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారని సమాచారం. ఇంత భారీ మొత్తం దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఇంకా ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుండటంపై సామాన్యులు మండిపడుతున్నారు. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలిస్తే.. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో దాదాపుగా నెలకు 8500 టన్నుల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు లారీలో ఇసుక తీసుకొస్తే టన్ను రూ.800కు స్టాక్ పాయింట్లో దించాలి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు టన్ను రూ.1200 ప్రకారం స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారని తెలుస్తోంది. టన్నుకు అదనంగా రూ.400 నుంచి రూ.700 దండుకుంటున్నారు. 8500 టన్నులకు నెలకు రూ.34 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై ఇసుక స్టాక్ పాయింట్ను అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలకు అప్పగించారు. వీరు అదనపు దోపిడీకి తెరలేపారు. బేస్తవారిపేట జంక్షన్, కొమరోలు, రాచర్ల మండల కేంద్రాల్లో టన్ను రూ.1300, అర్ధవీడులో టన్ను రూ.1500, గిద్దలూరులో టన్ను రూ.1200, కంభంలో రూ.1500కు విక్రయిస్తున్నారు. మండల కేంద్రం నుంచి పల్లెలకు ట్రాక్టర్లతో ఇసుక తరలించడానికి అదనపు భారం పడుతోంది. గతంలో 40 టన్నుల లారీ ఇసుక రూ.34 వేల నుంచి రూ.36 వేలకు వచ్చేది. నేడు రూ.52 వేలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
బాడుగ అదనం...
తరలించే దూరాన్ని బట్టి టన్నుకు రూ.200 నుంచి రూ.400 బాడుగ అదనంగా చెల్లించాలి. అరకొరగా అవసరమైన ఇసుకను తెచ్చుకోవాలంటే బాడుగ ఖర్చులు భారంగా మారుతున్నాయి. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో స్టాక్ యార్డ్ పేరుతో ఈ దందా జరుగుతోంది.
ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక అమ్మకాలపై డేగకన్ను వేశారు. లూజుగా ఇసుక అమ్ముకునే వ్యక్తుల వద్దకు వెళ్లి కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో బాడుగలకు వెళ్లిన లారీలు ఖాళీగా తిరిగి వచ్చే సమయంలో ఇసుక తెచ్చుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. వారిని పోలీసులతో బెదిరించి పోలీస్స్టేషన్లలో లారీలను పెట్టడంతో వారు చెప్పిన ధరకే డంపింగ్ యార్డ్లో అన్లోడ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కాసులు పిండేస్తాం!

కాసులు పిండేస్తాం!