
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం
పేదల వైద్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పజెప్తారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆందోళన పీపీపీని ఆపకపోతే ఆమరణ దీక్షలకై నా సిద్ధమన్న నాయకులు
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటం అన్యాయమని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జీ.దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న మహానేతలు జగజ్జీవన్ రామ్, బీఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ పేద పిల్లల వైద్య విద్యకు అడ్డుపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి అనుసంధానంగా ఉండే ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటుపరం చేయటం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురంలో వందల కోట్ల రూపాయలతో వైద్యశాల నిర్మిస్తే దానిని ప్రైవేటుపరం చేయాలని చూడటం పశ్చిమ ప్రకాశం ప్రజలను నిలువునా మోసం చేయటమేనన్నారు. దానికితోడు మార్కాపురాన్ని ప్రత్యేకంగా జిల్లా చేస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు మార్కాపురంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం ఏవిధంగా చేస్తావని ఆయన ప్రశ్నించారు. పేదల వైద్యంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. పేదలను ప్రైవేటు వైద్యశాలలకు పంపించేందుకే చంద్రబాబు పన్నాగం పన్నాడని, అందుకే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తున్నాడన్నారు.
మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పేద పిల్లల వైద్య విద్యకు అడ్డుపడుతున్న కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి అనుసంధానంగా ఉండే ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేటు పరం చేయటమేమిటని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు జీవితం అంతా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయటమేనని ఆదెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడతలోనే మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయాలని చూడటం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రజలను నిలువునా మోసం చేయటమేనని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవ ప్రసాద్ మాట్లాడుతూ 2019–2024 మధ్యకాలంలో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఒక్కటి అంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా స్థాపించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు చర్యల వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం సంవత్సరానికి రూ.5 వేలకే ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మొత్తం 29 ప్రైవేటు కాలేజీలను ఈ వివరాలివ్వాలని విజిలెన్స్ విభాగం అధికారులు కోరారని అందులో 15 కాలేజీలు స్పందించగా, 6 కాలేజీల యాజమాన్యాలు కొత్తగా వచ్చామని చెప్పారన్నారు.
ఆందోళన కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిలకా ఇశ్రాయేలు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దుడ్డు వినోద్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉన్నం జనార్దన్ రావు (బుజ్జి), ఎస్సీ సెల్ ఒంగోలు పట్టణ అధ్యక్షుడు గోపీ చంద్, నాయకులు మాజీ ఎంపీపీ కే నరసింహారావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవరపల్లి రమణ, బి యోహాన్, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు గోపీ, కావూరి ఏసోబు, జె.ఇశ్రాయేలు, మధు, కంభంపాటి సన్నిబాబు, జి సామేలు, డగ్లస్, దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.ఏసుదాసు, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఆదిమూలపు లూకా, పూనూరి దేవదానం, సంతనూతలపాడు నియోజకవర్గం తేళ్ల పుల్లారావు, మద్దిపాడు మండల నాయకులు రాయపాటి విల్సన్, కావూరి యేసోబు, కొనకమిట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంచికల చిన్న కోటేశ్వరరావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలులో అంబేడ్కర్ బొమ్మ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు