
వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కపటనాటకాలు ఆపి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మార్కాపురం ప్రచార సభకు వచ్చినప్పుడు తానే వెలుగొండను పూర్తిచేస్తానని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వెలుగొండ పూర్తిచేస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, కరువు పోతుందన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నిధులు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు పునరావాస కాలనీల్లో గృహాలు పూర్తిచేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
ఒంగోలు టౌన్: భూస్వామ్య దోపిడీని ఎదిరించి నిలిచిన వీరనారి ఐలమ్మ, బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంలో మరణించిన రామకృష్ణల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలను నిర్మిస్తామని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య చెప్పారు. ఆదివారం నగరంలోని ఎల్బీజీ భవనంలో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గ్రామాల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు టంగుటూరి రాము మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో 2000 సంవత్సరంలో విపరీతంగా పెంచిన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బషీర్బాగ్ పోలీసు కాల్పుల్లో అమరులైన రామృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డా.కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, చందలూరు శ్రీనివాసులు, యోగమ్మ, బొప్పరాజు హరిబాబు, రాయల్ల కాశయ్య పాల్గొన్నారు.
శ్రీనివాసరావు
ఒంగోలు సిటీ: జిల్లాలో ఈనెల 18, 19 వ తేదీల్లో జరిగే యూటీఎఫ్ రణభేరి జాతాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు, ఆర్థిక అంశాల మీద ఉపాధ్యాయులను చైతన్యవంతం చేసేందుకు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం రణభేరి బైకు జాతాను ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రూపొందించిందని తెలిపారు. దీనికి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సీపీఎస్ 90 శాతం బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియమించడం, 30 శాతం ఐర్ ప్రకటించడం, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఎన్క్యాష్మెంట్ తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో రణభేరి బైకు జాతా ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం కనిగిరిలోకి ప్రవేశిస్తుందని గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, మార్కాపురం, పొదిలి, దర్శి, చీమకుర్తి మీదుగా ఒంగోలుకు 19 తేదీ సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఓవీ వీరారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, జిల్లా సహాధ్యక్షురాలు జి ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి ఎం సత్యనారాయణ రెడ్డి, పీ బాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి