
సమన్వయంతో ముందుకెళతా
39వ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా కుటుంబ సమేతంగా ఎన్ఎస్పీ గెస్ట్హౌస్కు వచ్చిన కలెక్టరుకు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్వో బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్పై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ అన్నారు. అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.