తల్లికి వందనం నగదు పడలేదు | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం నగదు పడలేదు

Jun 22 2025 3:26 AM | Updated on Jun 22 2025 3:26 AM

తల్లికి వందనం నగదు పడలేదు

తల్లికి వందనం నగదు పడలేదు

ఒంగోలు సిటీ:

ల్లికి వందనం రాని వారి సంఖ్య జిల్లాలో రోజు రోజూకూ పెరుగుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు హామీలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లతో పాటు జిల్లా స్థాయి నేతలు హామీ ఇచ్చారు. ఎప్పటిలాగే అధికారంలోకి వచ్చాక నాలుక మడతెట్టేశారు. రూ.15 వేల నుంచి రూ.13 వేలకు కుదించగా చాలా మంది లబ్ధిదారులకు రూ.10,900 బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో విస్తుపోతున్నారు. ఇదేమని అడిగితే సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిళ్లల్లో కూడా ఒక్కరికే తల్లివందనం నగదు జమైన సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ సుమారు సుమారు 3,74,939 మంది విద్యార్థులు ఉన్నారు. 2,65,559 మంది విద్యార్థులను మాత్రమే అర్హులుగా చేర్చింది. రకరకాల నిబంధనల పేరుతో సుమారు 1,09,380 మందికి ఎసరుపెట్టింది.

కేంద్రియ విద్యార్థులకు దూరం..

జిల్లాలో ఒంగోలు, పెద్దారవీడు మండలం రాజంపల్లిలో కేంద్రియ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 2500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో దాదాపు 40 శాతం మంది విద్యార్థుల పేర్లను ఈ పథకం నుంచి గల్లంతయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రం ఎదుట సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కూడా చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఏం జరుగుతుందో చెప్పేవారు కరువయ్యారు.

ఇంటర్‌, పది విద్యార్థులకు కోత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకటించిన హామీలు అమలు చేసి ఉంటే గత ఏడాది ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేది. నేడు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఈ పథకం దూరమైంది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ రెండో సంవత్సరం చదివిన వారు 20,815 మంది ఉన్నారు. వీరిలో ఇంటర్‌ పూర్తి చేసి ఉన్నత చదువులకు పొరుగు ప్రాంతాలకు వెళ్లిన, ఫెయిలైన విద్యార్థులు ఈ పథకానికి పూర్తిగా దూరమైనట్లే. అలాగే జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 29,602 మంది ఉన్నారు. వీరికి సైతం డబ్బులు పడలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఇలా మోసం చేయడం తగదని వారు మండిపడుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం..

ఉదయం లేవగానే ఇంటి ముందు చెత్తను తీసేసి వీటిని శుభ్రంగా ఉంచే కార్మికులను కూడా ప్రభుత్వం వదల్లేదు. అంత గొప్ప పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం ఎగ్గొట్టింది. జిల్లాలో సుమారు 3,500 మంది పారిశుద్ధ్య కార్మికులు పగలనకా రేయనక చాలీచాలని జీతంతో పస్తులుండి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల మీద కూడా కూటమి ప్రభుత్వానికి దయ లేదంటే ఏం చేయాలో తెలియడం లేదని కార్మికులు వాపోతున్నారు.

నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు, ఒక పాప. కుమారుడు ఈ ఏడాది పదో తరగతి చదవాల్సి ఉంది. కుమార్తె 8వ తరగతిలో ప్రవేశించింది. కుమార్తె వాకా భవ్యశ్రీకి తల్లికి వందనం నగదు నా ఖాతాలో జమైంది. కానీ కుమారుడు వాకా వెంకట లీలా వర్థన్‌రెడ్డికి మాత్రం తల్లికి వందనం నగదు జమ కాలేదు. నా కుమారుడు పేరు అర్హుల జాబితాలో లేదు. అనర్హుల లిస్టులో కూడా లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా, అర్జీ పెట్టుకోమన్నారు. మర్రిపూడి సచివాలయంలో అర్జీ పెట్టుకున్నా, నా కుమారుని పేరుతో తల్లివందనం నగదు జమ అవుతాయో, కావో తెలియడం లేదు.

జవహర్‌ నవోదయ విద్యార్థుల పేర్లూ గల్లంతు..

జవహర్‌ నవోదయలో చదువుతున్న విద్యార్థుల పేర్లు సైతం గల్లంతయ్యాయి. జిల్లాలో ఒంగోలు నగరం, తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జవహర్‌ నవోదయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 544 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి పేర్లు సైతం తల్లికి వందనం పథకంలో లేవు.

– వాకా యశోద, మర్రిపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement