
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికృత రాజకీయం, విషపూరిత ప్రచారం చేస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిందని, దానిని నిలదీస్తున్న వారి గొంతులు నొక్కేస్తోందని విమర్శించారు. జిల్లాలోని పొదిలి, పల్నాడులో జరిగిన ఘటనలు, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్రమ అరెస్టులే అందుకు నిదర్శనమని అన్నారు. వీటిని అందరూ ఖండించాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యువతకు అన్యాయం చేయడం అలవాటని మండిపడ్డారు. ఆనాడు నిరుద్యోగ భృతి ఇస్తామని కొందరికే ఇచ్చి మంగళం పలికేశారన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకూ రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లు 25 లక్షల మందికి ఉద్యోగాల హామీలు గుప్పించారన్నారు. బీసీలకు పది వేల కోట్ల ప్రత్యేక నిధి, ఐదు వేల కోట్ల ఆదరణ, ఆరోగ్యశ్రీపై ఎన్నో హామీలిచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో కూటమి పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం వెచ్చించింది మాత్రం 10 శాతం కూడా లేదని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇచ్చేశామని, వీటికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అని చంద్రబాబు అనడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నింటినీ ఎగ్గొట్టారని ఆరోపించారు. ఏడాది పూర్తయిన తర్వాత తొలి అడుగు అంటూ ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పొదిలి జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనమే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. అది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచే వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశానికి సంజీవనిగా ఉన్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారన్నారు.
రైతుల పరిస్థితి దారుణం...
కూటమి ఏడాది పాలనలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఎమ్మెల్యే తాటిపర్తి మండిపడ్డారు. గతంలో రూ.24 వేలు అమ్మిన తేజ రకం మిర్చి నేడు రూ.పది వేలకు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. పత్తి రైతు పరిస్థితి కూడా అంతేనన్నారు. ఇక, పొగాకు రైతు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. నాణ్యమైన పొగాకును సైతం కొనే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు సాగు విరామాన్ని ప్రకటించారన్నారు. ఇవన్నీ చూస్తే పెద్ద మొత్తంలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కచ్చితంగా ప్రజలు తిరగబడతారన్నారు. కూటమి పార్టీల నాయకులను ప్రజలు ధ్వేషిస్తున్నారని, ఏడాది కాలంలో ఇంత వ్యతిరేకత రావడం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని విమర్శించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డికి లిక్కర్తో సంబంధాలుంటే ముందే ఎఫ్ఐఆర్లో ఎందుకు ఆయన పేరు లేదని తాటిపర్తి ప్రశ్నించారు. చెవిరెడ్డి గన్మెన్లలో మీకు అనుకూలంగా చెప్పిన వారికి ప్రమోషన్లు ఇచ్చి ఆక్టోపస్లో చేరారని, మీకు సహకరించని వారు ఆస్పత్రి పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇందంతా పరిశీలిస్తే ప్రభుత్వ కుట్రకోణం అర్థమవుతోందన్నారు. దీనిని వైఎస్సార్ సీపీ ఖండిస్తోందన్నారు. చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
రెడ్ బుక్ పాలన కొనసాగితే మరింత వ్యతిరేకత...
రాష్ట్రంలో ఇదేవిధంగా రెడ్ బుక్ పాలన కొనసాగితే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని ఎమ్మెల్యే తాటిపర్తి హెచ్చరించారు. యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, మొదటి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీలేదని విమర్శించారు. ఏడాదికి ఐదు లక్షల మందికి ఉద్యోగాల మాట దేవుడెరుగు, అధికారంలోకి వచ్చాక సుమారు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సువర్ణ పరిపాలన అని ఆయన ప్రశ్నించారు. దీనిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. స్వర్ణాంధ్ర చేస్తున్నామని చెబుతూ వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వారిని ఖైదీలుగా మారుస్తున్నారన్నారు. ఏడాది కాలంలో ఒక్క కంపెనీ రాలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక పెట్టుబడి లేదని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని తొలగించి రాష్ట్రాన్ని రోగాంధ్రగా మార్చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ లేక రోగాలతో అల్లాడుతున్న ప్రజల్ని పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. బీసీలకు మైనింగ్లో 20 శాతం రాయితీ ఇస్తామన్నారని, జిల్లాలో ఒక్క బీసీకై నా మైన్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులందర్నీ మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని గుర్తుచేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జగన్ పర్యటనల్లో ప్రజా స్పందనే నిదర్శనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు
ఫేక్ వీడియోతో జగన్పై అసత్య ప్రచారం
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే తాటిపర్తి ధ్వజం