
సమస్యలు పరిష్కరించాలి
జాప్యం లేకుండా
● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చూడాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు ఉండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించాలి...
జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలని జిల్లా డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం నాయకులు కలెక్టర్కు విన్నవించారు. బి.శ్రీనివాసరావు, ఎన్.రవికుమార్, తదితరులు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ను కలిసి జిల్లాలో మహిళా ఉద్యోగులపై జరిగిన శారీరక, మానసిక వేధింపుల వివరాలను అర్జీ రూపంలో తెలియజేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై రోజురోజుకు వేధింపులు అధికమవుతున్నాయని వివరించారు. ఒక మహిళా ఉద్యోగి విషయంలో చాలా దారుణంగా సహచర పురుష ఉద్యోగులు వేఽధించి కేసులు నమోదైనా నేటికీ ఎలాంటి చర్యలు లేకపోగా ఇంకా ఆ ఉద్యోగినిని బాధపెడుతూనే ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 20 వేల మందికిపైగా ఉన్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్ల గురించి వివరించిన అధికారులు...
జిల్లాలో నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పెరుగుతున్నాయని కలెక్టర్కు మార్క్ఫెడ్, జిల్లా వ్యవసాయ అధికారులు వివరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్లో మార్క్ఫెడ్ డీఎం మురళీకృష్ణ, జేడీఏ ఎస్.శ్రీనివాసరావు కలెక్టర్ను కలిసి మద్దిపాడు మండలం గార్లపాడులో నల్ల బర్లీ పొగాకు అమ్మకాల్లో పురోగతిని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజెక్టు చేసే బేళ్ల శాతం పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశించారు. నల్ల బర్లీ పొగాకు రైతులను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా మొత్తంమ్మీద 10 మండలాల్లో నల్ల బర్లీ పొగాకు పండించారని, పూర్తిగా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
మాజీ ఎంపీపీ ‘పోశం’పై అక్రమ కేసు!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల బరితెగింపు రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్రెడ్డిపై తాళ్లూరు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు రెవెన్యూ పరిధిలో మధుసూదన్ రెడ్డికి చెందిన పొలంలోకి స్థానిక టీడీపీ నేతలు అక్రమంగా ప్రవేశించి, ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగారు. తన పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని వదిలేయాలని చెప్పేందుకు మీరెవరంటూ టీడీపీ నాయకులను నిలదీయడంతో మాటామాటా పెరిగింది. భూమికి సంబంధించిన పత్రాలను టీడీపీ నాయకులకు చూపినప్పటికీ.. పొలంలో అడుగుపెడితే అంతుచూస్తామని బెదిరించి వెళ్లారు. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై తాళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈనెల 11న ‘పోశం’ ఫిర్యాదు చేశారు. కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ఎస్సైని ప్రశ్నించగా టీడీపీ నాయకులను పిలిపించి, వారితో తప్పుడు ఫిర్యాదు చేయించి తనపై అక్రమ కేసు నమోదు చేశారని ‘పోశం’ వివరించారు. తప్పుడు కేసులకు బెదిరేది లేదని, ఈ విషయమై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు.