
పొగాకు రైతు నిలువు దోపిడీ
కొండపి/టంగుటూరు: వేలం కేంద్రాల్లో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన పొగాకు ఖర్చులకు, వేలంలో వస్తున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. వేలం అధికారులు సైతం వ్యాపారులకు మద్దతుగా ఉండటంతో రోజు రోజుకు ధరలు దిగజారుతున్నాయి. ఓ వైపు దిగజారుతున్న ధరలు, మరో వైపు నిత్యం వందల సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్న బేళ్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలంలో గరిష్టంగా రూ.280 ధర ఇస్తున్నారు. కానీ వ్యాపారులు సిండికేట్గా మారి కేవలం 20 శాతం బేళ్లను మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన బేళ్లను కనిష్ట ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో పక్క లోగ్రేడ్ పొగాకు ధరలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. వేలం ప్రారంభంలో రూ.240 పలికిన లో గ్రేడ్ పొగాకు ప్రస్తుతం రూ.165కు పడిపోయింది. రానున్న రోజుల్లో లో గ్రేడ్పొగాకు ధర మరింత పడిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వందల బేళ్ల తిరస్కరణ
వేలం కేంద్రానికి సోమవారం క్లస్టర్ పరిధిలోని గోగినేనివారిపాలెం, అక్కచెరువుపాలెం, పైడిపాడు గ్రామాలకు చెందిన రైతులు 1024 బేళ్లను వేలానికి తీసుకురాగా 732 బేళ్లను కొనుగోలు చేసి 287 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.165 పలకగా సరాసరి రూ.248.23గా నమోదైంది. వేలంలో 24 కంపెనీలు పాల్గొన్నా..నాలుగైదు కంపెనీలు మాత్రమే ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేశాయి. రైతులు తీసుకువచ్చిన బేళ్లలో ఎక్కువ శాతం బేళ్లను రూ.165 నుంచి రూ.240 వరకు కొనుగోలు చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన వేలంలో కేవలం 160 బేళ్లకు మాత్రమే గరిష్ట ధర రూ.280 రాగా మిగిలిన బేళ్లకు కనిష్ట ధరలు వేశారని రైతులు వాపోయారు.
అదనపు భారం
రోజుకు వందకు పైగా బేళ్లను వ్యాపారులు తిరస్కరించడంతో మరొకసారి వేలానికి తీసుకురావడానికి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. పొగాకు బోర్డు అధికారులు బయ్యర్లతో సంప్రదింపులు చేసి గిట్టుబాటు ధరకు పొగాకును కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అధికారులు మొక్కుబడిగా వేలం కేంద్రాలకు పరిశీలనకు వచ్చి వెళుతున్నారే తప్ప రైతుల గోడు ఆలకించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టంగుటూరు వేలం కేంద్రానికి 958 బేళ్లు రాగా 207 బేళ్లను తిరస్కరించి 751 కొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.180 పలికి సరాసరి రూ.239.34గా నమోదైంది.
వేలంలో 20 శాతం బేళ్లకే గరిష్ట ధర
మిగిలిన 80 శాతం బేళ్లకు కనిష్టమే..
రోజు రోజుకూ దిగజారుతున్న
లో గ్రేడ్ పొగాకు ధర
వ్యాపారుల సిండికేట్తో రైతులకు తీరని నష్టం