తొలిరోజే తుస్సు..! | - | Sakshi
Sakshi News home page

తొలిరోజే తుస్సు..!

Jun 24 2025 4:17 AM | Updated on Jun 24 2025 4:17 AM

తొలిర

తొలిరోజే తుస్సు..!

కనిగిరి రూరల్‌/మార్కాపురం:

హిళా ప్రజాప్రతినిధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు.. స్థానిక పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర పెంచేందుకు, నాయకత్వ లక్షణాలు, విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తొలి రోజే తుస్సుమన్నాయి. మరో కొద్ది నెలల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రభుత్వం చేపట్టిన మూడు రోజుల శిక్షణపై మహిళా సర్పంచ్‌లు తీవ్ర నిరాసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, ఒంగోలు, చీరాల, కందుకూరు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈనెల 23 నుంచి జూలై 2వ వారం వరకు ఒక్కో బ్యాచ్‌కు మూడు రోజుల చొప్పున మహిళా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సోమవారం కనిగిరి, మార్కాపురంలో డివిజన్‌ స్థాయి శిక్షణ తరగతులు తూతూమంత్రంగా సాగాయి.

శిక్షణ శిబిరాలు వెలవెల

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 542 మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నట్లు నివేదికలున్నాయి. తొలిరోజు కనిగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో కేకేమిట్ల, సీఎస్‌పురం, దొనకొండ, దర్శి మండలాల సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దీనికి 64 మంది మహిళా సర్పంచ్‌లు హాజరు కావాల్సి ఉండగా.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు. శిక్షణ తరగతులను ఎంపీపీ డి.ప్రకాశం, ఎంపీడీఓ ప్రభాకర్‌ శర్మ, పొన్నలూరు ఎంపీడీఓ సుజాత, ఆర్‌పీలు అశోక్‌, నాగేమల్లేశ్వరరావు ప్రారంభించారు. ఆరుగురే హాజరుకాగా.. ఖాళీ కుర్చీలతో శిక్షణ కార్యక్రమాన్ని మమగా ముగించారు.

● మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం తొలిరోజే వెలవెలబోయింది. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారపేట, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలాలకు చెందిన సర్పంచ్‌లు 61 మంది శిక్షణకు హాజరుకావాల్సి ఉండగా 10 మంది కూడా హాజరు కాలేదు. శిక్షణ ఇచ్చేందుకు నలుగురు రిసోర్సు పర్సన్లను నియమించిన ప్రభుత్వం.. సర్పంచ్‌లను మాత్రం సమావేశానికి రప్పించడంలో విఫలమైంది.

మహిళా సర్పంచ్‌ల నిరసన

ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాలు ఏవైనప్పటికీ కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో శిక్షణా తరగతులు నిర్వహించడంపై మహిళా సర్పంచ్‌లు మండిపడుతున్నారు. కనిగిరిలో తొలిరోజు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరుకావాలంటే దొనకొండ మండల సర్పంచ్‌లు 40 కి.మీ, కొనకనమిట్ల, దర్శి, సీఎస్‌పుం మండలాల సర్పంచ్‌లు 32 నుంచి 35 కి.మీల దూరం ప్రయాణించాల్సి ఉంది. మార్కాపురంలో శిక్షణకు గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు మండలాల సర్పంచ్‌లు 40 కి.మీ నుంచి 60 కి.మీ మేర ప్రయాణించాల్సి ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంతో తిరిగి ఇళ్లకు చేరుకోవడం కష్టమనే భావనతో మహిళా ప్రజా ప్రతినిధులు శిక్షణకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో సర్పంచ్‌లకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకే పెత్తనమిచ్చారు. అధికారులు సైతం అందుకు సహకరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కని పరిస్థితితుల్లో ఉత్తుత్తి శిక్షణలు తమకు అవసరమా అంటూ మహిళా సర్పంచ్‌లు పెదవి విరుస్తున్నారు.

కనిగిరిలో శిక్షణకు మహిళా సర్పంచ్‌లు హాజరుకాకపోవడంపై ఎంపీడీఓ ప్రభాకర్‌ శర్మను వివరణ కోరగా.. ‘తొలిరోజు కావడంతో పూర్తిగా హాజరు కాలేదు. శిక్షణకు వచ్చిన వారికి సిట్టింగ్‌ చార్జీ కింద ప్రభుత్వం రూ.100 చెల్లించే అవకాశం ఉంది. రవాణ చార్జీలు ఎంత అనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. శిక్షణకు అందరు మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.

జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో మహిళా సర్పంచ్‌లకు శిక్షణ ప్రారంభం

పదవీ కాలం ముగియనున్న సమయంలో శిక్షణ తరగతులు ఎందుకో?

కూటమి ప్రభుత్వ తీరుపై మహిళా సర్పంచ్‌ల ఆగ్రహం

ప్రజాప్రతినిధులకు రవాణా ఖర్చులు కూడా ఇవ్వని వైనం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 567 మంది మహిళా సర్పంచ్‌లు

కనిగిరిలో 64 మందికిగాను వచ్చింది ఆరుగురే..

మర్కాపురంలో 61 మందికిగాను పది మంది హాజరు

తొలిరోజే తుస్సు..! 1
1/1

తొలిరోజే తుస్సు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement