
సాధువు వేషంలో వచ్చిన దొంగ అరెస్ట్
● నాలుగు సవర్ల బంగారు గొలుసు స్వాధీనం
● నిందితుడు శ్రీకాకుళం వాసిగా గుర్తింపు
చీమకుర్తి: సాధువు వేషంలో వచ్చి మహిళపై దాడి చేసి బంగారు గొలుసుతో పరారైన దొంగను చీమకుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా ముందు నిందితుడిని హాజరుపరిచారు. సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణానికి చెందిన 36 సంవత్సరాల వయసు గల పెడద శివను ఒంగోలు–చీరాల రహదారిలోని త్రోవగుంట క్రాస్రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సాధువు వేషంలో ఈ నెల 15వ తేదీ చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి పక్కనే నివాసం ఉంటున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గోలి పద్మజ ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడపై దాడి చేసి గాయపరిచాడు. ఆపై రుబ్బురోలు పత్రంతో ఆమె మొహంపై దాడి చేసి మెడలో ఉన్న దాదాపు 4 సవర్ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. తొలుత సాధువు వేషంలో ఆమె ఇంటి ముందుకు వెళ్లి ఏదైనా సహాయం చేయాలంటూ పద్మజను అడిగాడు. బయటకు వచ్చిన పద్మజ ఏమీ లేవని చెప్పి ఇంట్లోకి వెళ్లింది. నిందితుడు కూడా ఆమెను అనుసరించి కత్తితో, రుబ్బురోలు పత్రంతో దాడి చేశాడు. సాధువు వేషంలో వచ్చిన దుస్తులను అక్కడే వదిలేసి పద్మజ కుమారుడు దుస్తులు ధరించి పరారయ్యాడు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించిన పోలీసులు.. బాధితురాలి బంధువు ఎస్.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో నాలుగు టీమ్లుగా ఏర్పడి నిందితుడు పెడద శివను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు.
గ్రీన్ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత
సీఎస్పురం(పామూరు): ‘గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు కావాలని అడిగితే ఇచ్చాం. ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోండి’ అంటూ రైతులు నిరసనకు దిగారు. మండల కేంద్రమైన సీఎస్పురం వద్ద నిర్మాణంలో ఉన్న బెంగళూరు–కడప–విజయవాడ(బీకేవీ) గ్రీన్ఫీల్డ్ రహదారి పనుల ను సోమవారం సీఎస్పురం, డీటీపల్లి, ముళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకున్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై కంపవేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం వల్ల తాము కోల్పోతున్న పొలానికి సంబంధించి పరిహారం నేటికీ మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. తమకు పరిహారం ఇచ్చాకే రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలని రైతులు తేల్చిచెప్పారు.

సాధువు వేషంలో వచ్చిన దొంగ అరెస్ట్