
ధన, అధికారం, అవినీతి మధ్య నడిచే మానవ విలువల పోరాటమే కుబేర చిత్రకథాంశం. ఒక లక్ష కోట్ల స్కామ్ చుట్టూ అల్లిన కథగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ.. అవినీతి రాజకీయ వ్యవస్థపై విమర్శ, సామాజిక అసమానతలు, ఓ బిచ్చగాడి పాత్ర ద్వారా మనిషికి ఉండాల్సిన విలువలు చూపించడమే కాకుండా వాటి విజయం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో ఏ పాత్ర ఎవరు పోషించారో పరిశీలిస్తే..

దేవాగా ధనుష్ : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. అమాయకపు బిచ్చగాడిగా దేవా పాత్రలో ఒదిగిపోయారు. ఇంట్రో సీన్ దగ్గరి నుంచి క్లైమాక్స్ దాకా తన నటనతో ఆడియొన్స్ను కట్టిపడేశారు.

దీపక్ రాజ్గా : నాగార్జున సీబీఐ మాజీ అధికారి దీపక్ తేజ్ పాత్రలో.. ఒకవైపు తన భార్యాబిడ్డ కోసం చేయకూడని పనులు చేస్తూనే, మరోవైపు చెడు మనుషుల మధ్య మంచి మనిషిగా నలిగిపోతూ కనిపించారు.

సమీరాగా రష్మిక : దేవాతో అనూహ్య పరిచయం మొదలు.. కథలో కీలక పాత్రధారిగా సెటిల్డ్ ఫర్ఫార్మెన్స్తో సినిమా చివరిదాకా అలరించారీమె.

నీరజ్ మిత్రాగా : జిమ్ సర్భ్ తొలి తెలుగు చిత్రంతోనే.. తనదైన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారీయన. పాత్రకు న్యాయం చేయడానికి ఆయన తెలుగు కూడా నేర్చుకున్నారట. అపర కుబేరుడిగా కనిపించే ఈ పాత్ర.. సినిమా చివర్లో ఆయన పాత్ర బిచ్చగాడిగా మారడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది కూడా.

ఖుష్బూగా శ్రావణి : ఖుష్భూ అనే పాత్ర కుబేరకు సహాయ పాత్రగా కనిపించినా.. కథలో ఒక ప్రత్యేకమైన మలుపు తిప్పే క్యారెక్టర్ కూడా. సినిమాలో కడుపుతో ఉన్న బిచ్చగత్తె పాత్ర అయినప్పటికీ.. చిత్ర కథలోని మానవీయత, నైతిక సంక్లిష్టతల మధ్య ఆమె పాత్ర ఒక భావోద్వేగ కోణాన్ని అందించింది.

రోబోట్గా సౌరభ్ : ఖురానా రిచ్ మ్యాన్ నీరజ్ మిత్రా తర్వాత.. మరో విలన్ క్యారెక్టర్ ఇది. బిచ్చగాళ్ల పట్ల ఈ పాత్ర వ్యవహరించే తీరు ప్రేక్షకుడిని రగిలిపోయేలా చేస్తుంది. అంతగా జీవించాడు రోబోట్ క్యారెక్టర్లో సౌరభ్ ఖురానా.

దీపగా సునయన : తమిళ చిత్రాలతో పేరు సంపాదించుకుని.. కాస్త గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపిస్తోంది ఈ తెలుగమ్మాయి. దీపగా దీపక్ భార్య పాత్రలో కనిపించిన కాసేపైనా తనదైన ముద్ర వేసుకుంది.

నీరజ్ తండ్రిగా : దలీప్ తహిల్ బాలీవుడ్ సీనియర్ నటుడీయన. నీరజ్ మిత్రా తండ్రి పాత్రలో మెప్పించారు. అధికార వాదంతో.. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆశతో నడిచే కొడుకు పక్కనే ఉంటూ.. అడ్డుకునే ప్రయత్నమేమీ చేయదు ఈ పాత్ర. కానీ, దైవం రిఫరెన్స్తో మంచి చెప్పాలని చూస్తుంటుంది.

ఎస్సై అశోక్ గాడ్బోలేగా షాయాజీ షిండే : పాత్ర మొదలైంది మొదలు నెగెటివ్ ఛాయలు కనిపించే ఈ పాత్ర.. దేవా పరిస్థితిని అర్థం చేసుకునే దశలో ఎంత మంచిదో తెలుస్తుంది. దీపక్లో మార్పునకు కారణం కూడా ఈ ఎస్సై పాత్రే కావడం కథలో మరో ట్విస్ట్.

వీటితో పాటు సాధు పాత్రలో అలనాటి దర్శక నటుడు కే.భాగ్యరాజ్, పవర్+డబ్బు పేరాశ ఉన్న కేంద్ర మంత్రి క్యారెక్టర్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో హరీష్ పెరేడి, సబ్ రిజిస్ట్రార్గా జయప్రకాశ్, దయలేని అనాథాశ్రమ నిర్వాహకుడిగా నాజర్, మరో ఇద్దరు బిచ్చగాళ్లు ఖేలు,దీప్యగా అజిత్లాల్ శివలాల్, సత్యం కురుంగ్లు ఆకట్టుకున్నారు.