పిడికిళ్లు ఎగసి! | - | Sakshi
Sakshi News home page

పిడికిళ్లు ఎగసి!

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

పిడిక

పిడికిళ్లు ఎగసి!

ఆంక్షలు చెరిపేసి..

సాక్షిప్రతినిధి, ఒంగోలు:

క్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. అంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామంటూ అన్ని రకాలుగా ప్రభుత్వం మోసం చేసిందంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు నగరంలో నిర్వహించిన ‘యువత పోరు’కు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కలెక్టరేట్‌ చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను దించారు. అంబేడ్కర్‌ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా సామాన్య జనాన్ని కూడా రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. చివరికి అంబేడ్కర్‌ భవనం సమీపంలో పాత రిమ్స్‌ లోపల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే కాలిబాట వద్దకు కూడా పోలీసులను కాపలా పెట్టారు. ఎటుచూసినా పోలీసు బలగాలే. కలెక్టరేట్‌ పరిసరాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, పలువురు ఎస్సైలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, స్పెషల్‌ బ్రాంచి, ఇంటలిజెన్స్‌ పోలీసు విభాగాలను రంగంలోకి దించి హడావుడి సృష్టించారు. డ్రోన్‌ కెమెరాలతో యువత పోరుకు హాజరైన వారిని చిత్రీకరించారు. ఏదో జరిగిపోతుందోన్న భయానక వాతావరణాన్ని కల్పించారు. అంబేడ్కర్‌ భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసు అధికారులు ససేమిరా అన్నారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లడానికి పోలీసులు కేవలం 50 మంది మాత్రమే అనుమతించారు. వినతిపత్రం అందించడానికి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో ఉన్న కలెక్టర్‌ వెళ్లిపోవడంతో డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆంక్షలు తమను నిలువరించలేవంటూ జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, యువజనులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంబేడ్కర్‌ భవన్‌ నుంచి ప్రధాన రహదారి పైన ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చారు. తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియంతృత్వ పాలన తగదు : అన్నా

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. ప్రజలకు అండగా పోరాటాలు చేస్తోన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని, హామీల అమలు కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. హామీల అమలు కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోందని, అయినా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు కూటమి పాలకులు మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

జైల్‌ భరోకు కూడా సిద్ధమే : చుండూరి

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వస్తే సవాలక్ష ఆంక్షలతో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు విమర్శించారు. యువత పోరుకు జిల్లా వ్యాప్తంగా తరలివస్తున్న విద్యార్థి యువజన నాయకులను ఎక్కడికక్కడ నిలిపేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెబితే కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉందని అంటున్నారనీ ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజా సమస్యలను మరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పొదిలిలో పొగాకు రైతులకు మద్దతు తెలపడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే మహిళలను అడ్డుపెట్టుకొని గొడవలు సృష్టించారని ఆరోపించారు. గొడవలు సృష్టించిన వారిని వదిలేసి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికై నా అరెస్ట్‌లు ఆపకపోతే జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విద్యార్థి, యువజనులు తమ సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే భాష విషయంలో ఎక్కడా అదుపు తప్పవద్దని, అభ్యంతర కర పదాలను ఉపయోగించవద్దని సూచించారు.

కక్ష సాధింపులతో కాలయాపన : దద్దాల

అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలతో కాలయాపన చేస్తోందని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌ విమర్శించారు. నెలకొక అంశాన్ని తీసుకొని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.

హామీలు నెరవేర్చండి : శ్రీకాంత్‌రెడ్డి

గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రాష్ట్రంలోని యువతకు ఎన్నో హామీలు ఇచ్చారని ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రచారం చేశారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుద్యోగులను తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి పాలకులు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

నిరుద్యోగులకు మోసం: పల్నాటి

ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను, అన్నీ వర్గాల ప్రజలను నిట్టనిలువునా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్‌క్యాలెండర్‌ ఇస్తామని చెప్పారని, నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటిని అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం దాటినా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిట్టనిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్‌ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యూత్‌ రీజినల్‌ ఇన్‌చార్జ్‌ వెంకటాద్రి, ప్రకాశం, నెల్లూరు రీజినల్‌ ఇన్‌చార్జ్‌ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ జాయింట్‌ సెక్రటరీ పాలడుగు రాజీవ్‌, ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి, కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు మల్లిశెట్టి దేవ, అన్వేర్‌, రాజశేఖరరెడ్డి, గంగాధరరెడ్డి, ఆళ్ల క్రిష్ణారెడ్డి, జంకె క్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వేముల శ్రీకాంత్‌, ఒంగోలు టౌన్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాదర్‌, దర్శి, కనిగిరి, కొండపి విద్యార్థి విభాగాల అధ్యక్షులు మహేంద్రరెడ్డి, మహేంద్రరెడ్డి, సునీల్‌, యువజన విభాగం జనరల్‌ సెక్రటరీ ముల్లంగి రవీంద్రారెడ్డి, రాష్ట్ర స్టూడెంట్‌ సెక్రటరీ రవీంద్ర, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమోటు దేవప్రసాద్‌, దర్శి ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ఏసుదాసు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ చుట్టూ మొహరించిన పోలీసు బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి యువతను నిలువరించిన పోలీసులు ప్రభుత్వ వైఫల్యంపై నినదించిన యువత జిల్లా నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు వినతి పత్రానికి 50 మందికే అనుమతి.. నిరుద్యోగులను నిట్టనిలువునా మోసం చేసిన చంద్రబాబు హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం యువతపోరు ర్యాలీలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

శాంతియుత ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి

ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు

పోలీసుల ఆంక్షలతో కర్ఫ్యూను తలపిస్తున్న కలెక్టరేట్‌ పరిసరాలు

యువతకు వెన్నుపోటు: ఎమ్మెల్యే తాటిపర్తి

అబద్ధాలు, అసత్యాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విద్యార్థులు, యువకులకు వెన్నుపోటు పొడిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లోని సైబరాబాద్‌, సైబర్‌సిటీలను రంగుల్లో చూపించి ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ‘యువత పోరు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలోని యువకులకు ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తానని, లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని గత ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాన్ని గుర్తు చేశారు. ఏడాది పాలన పూర్తయినా నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వలేదని, ఏడాదికిగాను రూ.36 వేలు బకాయిలు చెల్లించకుండా మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెప్పు పొందటం కోసం ఒక్కరోజులో రూ.350 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర నిర్వహించారని, దీనికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. గిన్నిస్‌బుక్‌లో ఎక్కాలని కోట్లు ఖర్చు చేస్తే జనాలు మ్యాట్ల కోసం కొట్టుకోవడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రూ.2200 కోట్ల వసతి దీవెన, మొత్తం కలిపి రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారని, రాష్ట్రంలో 84 లక్షల మంది తల్లులు ఉంటే 50 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చాడని ధ్వజమెత్తారు. ఎక్కడో ఒక చోట ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి తల్లికి వందనం ఇచ్చి పచ్చమీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వస్తే మహిళలతో నిరసనలు చేయించి గొడవలు సృష్టించారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీదనే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే రాంబాబు, చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ, పల్నాటి రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు

కలెక్టరేట్‌లోకి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రధానద్వారం వద్ద మోహరించిన పోలీసులు

అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో బారికేడ్లను అడ్డుపెట్టి రాకపోకలు అడ్డుకుంటున్న పోలీసులు

పిడికిళ్లు ఎగసి!1
1/3

పిడికిళ్లు ఎగసి!

పిడికిళ్లు ఎగసి!2
2/3

పిడికిళ్లు ఎగసి!

పిడికిళ్లు ఎగసి!3
3/3

పిడికిళ్లు ఎగసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement