
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై దాడి
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అధికారం ఉందనే అహంతో తెలుగు తమ్ముళ్లు సామాన్యులు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అకారణంగా దాడులకు తెగబడుతూ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై టీడీపీ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొన్నలూరు మండలం కే అగ్రహారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుని కథనం మేరకు... మండలంలోని బోగనంపాడు గ్రామానికి చెందిన ముళ్లమూరి గోపి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇది చూసి ఓర్వలేని గ్రామంలోని కొందరు తెలుగు తమ్ముళ్లు అప్పుడప్పుడూ గోపిని దుర్భాషలాడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయినా సరే వారితో గొడవ అనవసరమని గోపి ఎక్కడా సహనం కోల్పోకుండా గ్రామంలో తనపని తాను చేసుకుంటు ఉన్నాడు. అయితే గోపిపై ఎలాగైనా దాడిచేసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయపెట్టాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ఆదివారం బోగనంపాడు గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున కే అగ్రహారంలోని మద్యం షాపు దుకాణం సమీపంలోకి వెళ్లి మేకల మధు ఫోన్ చేసి పని ఉంది నీతో మాట్లాడాలి రమ్మని గోపిని కే అగ్రహారం పిలిచాడు. ఈ లోపు కే అగ్రహారానికి చెందిన ఎస్కే బాషని పిలిపించి మాట్లాడారు. గోపి వచ్చిన తరువాత అతనిపై దాడి చేస్తే మద్యం ఇప్పిస్తామని రెచ్చగొట్టి బాషతో దాడి చేయడానికి సిద్ధం చేశారు. కొంత సమయం తరువాత గోపి రావడంతో నలుగురు కలిసి అతనితో మాటలు కలిపి గొడవకు దిగారు. ఇంతలో బాష ఒక్కసారిగా పక్కనే ఉన్న రాయి తీసుకొని గోపి తలపై కొట్టి దాడి చేశాడు. నలుగురు కలిసి గోపిపై దాడి చేస్తుండటంతో ఇంతలో చుట్టుపక్కల వారు దాడిని గమనించి అడ్డుపడగా మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున అక్కడ నుంచి తప్పించుకోవడంతో బాషను పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన గోపిని చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అలాగే పట్టుబడిన బాషను గ్రామస్తులు పొన్నలూరు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు.
జులాయిగా తిరుగుతుంటారు...
ఇదిఇలా ఉంటే గోపిపై దాడిచేసిన మేకల మధు, మీసాల నాగేశ్వరరావు, ముత్తంగి మల్లికార్జున, ఎస్కే బాష నిత్యం మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని అంటున్నారు. అలాగే బాష బైక్లు చోరీ చేస్తుంటాడని, అతనిపై శ్రీకాకుళంలో కేసు కూడా ఉన్నట్లు సమాచారం. గోపి వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉండటం ఓర్చుకోలేని వీరు అతనిపై దాడి చేయించారని, అతన్ని చంపాలనే ఈ దాడికి తెగబడ్డారని గోపి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు ఫిర్యాదు అందిందని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై అనూక్ తెలిపారు.
ఫోన్ చేసి పిలిపించి రాయితో దాడిచేసిన టీడీపీ వర్గీయులు తలకు తీవ్ర గాయం, ఆస్పత్రికి తరలింపు

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై దాడి