
అన్నాచెల్లెలి కిడ్నాప్పై కేసు నమోదు
నల్లమాడ(అనంతపురం): అన్నాచెల్లెలును కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు నల్లమాడ పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం నల్లమడుగుల గ్రామానికి చెందిన గాయపు అంకమ్మ, ఏసురత్నం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కట్టెలు కాల్చి బొగ్గుల చేసే పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో అంకమ్మ తన కుటుంబసభ్యులతో కలసి సోదరుడు సమరం నగేష్ వెంట ఇటీవల నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి వలస వచ్చి బొగ్గులు కాల్చే పనిని చేపట్టారు. ఈ నెల 22న రాత్రి ఒంటి గంట సమయంలో ఏసురత్నం ఇంట్లో లేని సమయంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బొగ్గుల వ్యాపారి (సేటు) ఎం.యంగయ్య, మరో నలుగురు వచ్చి అంకమ్మ, ఆమె సోదరుడు నగేష్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. 23న వారి బారి నుంచి తప్పించుకుని ఇద్దరూ దొన్నికోటకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నల్లమాడ పోలీసులకు అంకమ్మ ఫిర్యాదు చేశారు. పాత బాకీ తీర్చాలంటూ తనను, తన సోదరుడిని యంగయ్య, మరో నలుగురు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం మంగళవారం కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వీరయ్య హత్య కేసు..
పోలీస్ కస్టడీకి నలుగురు నిందితులు
● వినోద్ను కొప్పోలులోని ఇంటికి తీసుకెళ్లి విచారించిన పోలీసులు
ఒంగోలు టౌన్: టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుష్యేంద్ర బాబు, ఓబిలి నాగరాజును మంగళవారం ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి నేరుగా ఒంగోలు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి తాలూకా పోలీసు స్టేషన్కు తరలించి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల సమయంలో వీరయ్య హత్యలో ప్రధాన పాత్రధారిగా చెబుతున్న వినోద్ కుమార్ను తీసుకుని కొప్పోలులోని అతని నివాసానికి తీసుకెళ్లి విచారించారు. ఈనెల 27వ తేదీ వరకు నలుగురు నిందితులను పోలీసు తమ కస్టడీలోనే ఉంచి విచారించనున్నారు. మరో వైపు ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెబుతున్న ముప్పా సురేష్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ దొరకకపోతే పోలీసులకు లొంగిపోవచ్చని స్థానికంగా ప్రచారం నడుస్తోంది.