
సైకిల్ యాత్రికుడు.. పర్యావరణ ప్రేమికుడు
● పర్చూరుకు చేరుకున్న సైకిల్ యాత్రికుడు సెల్వన్
పర్చూరు(చినగంజాం): ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైకిల్పై యాత్ర చేస్తూ ప్రపంచ పర్యటన చేస్తున్న ముత్తు సెల్వన్ మంగళవారం పర్చూరు చేరుకున్నారు. పర్చూరులో తహసీల్దార్ బ్రహ్మయ్య ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన ముత్తు సెల్వన్ 2021 డిసెంబర్ 28న సైకిల్పై ప్రయాణం ప్రారంభించి దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ప్రాణవాయువు కొరత కారణంగా ఎవరూ మృతి చెందకూడదన్న లక్ష్యాన్ని ఎంచుకొని సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తూ మార్గమధ్యంలో మొక్కలు నాటుతూ ముందుకు సాగుతన్నానని సెల్వన్ వివరించారు. రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున 1111 రోజుల్లో 39,900 కి.మీ ప్రయాణించి, మొత్తం 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తన ప్రయాణంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్లోనూ పర్యటించనున్నట్లు చెప్పారు. పర్చూరులో తహసీల్దార్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం సెల్వన్కు ప్రశంస పత్రం అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.