
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులివ్వాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు కార్డులను మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 46,015 మందికి సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారని, ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, గృహనిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ అంశాలకు సంబంధించి పీజీఆర్ఎస్ పెండింగ్, రీ వెరిఫికేషన్ అఫ్ హౌస్ సైట్స్, హౌస్ సైట్ అప్లికేషన్స్, వాటర్ టాక్స్ కలెక్షన్, కోర్టు కేసుల పురోగతి, రీ సర్వే ప్రక్రియ, నిత్యావసర సరుకుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై కూడా సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి నివేశన స్థలాల అర్జీలు, అర్హులు వివరాలు, ఎంత స్థలం అందుబాటులో ఉంది తదితర వివరాలపై గ్రామాల వారీగా పూర్తి నివేదిక సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల రీసర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేసవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, పౌర సరఫరాల శాఖ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, వివిధ సెక్షన్ల సుపరింటెండెంట్లు పాల్గొన్నారు.
రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో జేసీ గోపాల కృష్ణ
సమన్వయంతో పనిచేసి లక్ష్యం పూర్తి చేయాలని సూచన