యువత చిత్తు | - | Sakshi
Sakshi News home page

యువత చిత్తు

Jun 23 2025 5:34 AM | Updated on Jun 23 2025 5:34 AM

యువత

యువత చిత్తు

వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025
గంజాయి మత్తు..

పశ్చిమ ప్రకాశంలో గుప్పుమంటున్న గంజాయి

నిన్నా మొన్నటి వరకు జిల్లా కేంద్రానికి పరిమితమైన గంజాయి ఈ ఏడాది కాలంలో పశ్చిమ ప్రకాశానికి విస్తరించినట్లు సమాచారం. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, మార్కాపురం, గిద్దలూరు, కంభం, కనిగిరి, పొదిలి ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమంలోని మార్కాపురం, బేస్తవారిపేట, గిద్దలూరు, కంభం ప్రాంతాల్లో ఎక్కువగా బీఈడీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి వ్యాపారులు గుట్టుగా దందా సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. శనివారం గిద్దలూరులో ఒడిశా నుంచి గంజాయిని తరలించి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కంభంలోని హైవే పై ఉన్న ఒక లాడ్జిలో ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయితోపాటుగా మత్తుమాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. యర్రగొండపాలెంలో కూడా పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఇటీవల పుల్లలచెరువులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి 1.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో ఒక సాధువు, మరో ఇద్దరు యువకుల నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాను గంజాయి పట్టిపీడిస్తోంది. తూర్పు, పశ్చిమం తేడాల్లేకుండా జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నారు. విద్యార్థులు సైతం గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా కేజీలకొద్దీ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. గంజాయి మత్తులో ఘర్షణలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నారు.

జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు, వినియోగం

మారుమూల గ్రామాలకు విస్తరించిన గంజాయి వ్యాపారం

గంజాయి మత్తులో హత్యలకు పాల్పడుతున్న వైనం

ఒంగోలు నగరంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టివేత

గంజాయి విక్రేతలుగా పట్టుబడుతున్న విద్యార్థులు

మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు

నామమాత్రపు దాడులతో సరి

గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన బీటెక్‌ విద్యార్థి

గంజాయి విక్రయిస్తూ ఒక బీటెక్‌ విద్యార్థి పోలీసులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. టంగుటూరు మండల పరిధిలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివే విద్యార్థి ఒకరు విశాఖపట్నం నుంచి 5 కిలోల గంజాయి తీసుకొచ్చాడు. వల్లూరులోని ఒక హోటల్‌ వెనుక ఉన్న హాస్టల్‌లో దాచి ఉంచాడు. ఈలోపు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా జిల్లాలోని అనేక ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు గంజాయికి అలవాటు పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా కాలేజీ హాస్టల్‌లోని గదులనే గంజాయి డెన్‌లుగా మార్చుకున్న ఘటనలు ఉన్నాయి. విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ప్రధాన కారణం గంజాయి మత్తేనని ఒక పోలీసు అధికారి చెప్పడం గమనార్హం. జిల్లాలోని కళాశాలలు, కాలేజి హాస్టళ్లలోని విద్యార్థులకు గంజాయిపై అవగాహన కల్పించేందుకు పోలీసులు అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమాలన్నీ ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

తంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి వినియోగించేవారు. ఇప్పుడు విద్యార్థులు, యువకులు కూడా గంజాయి మత్తుకు అలవాటు పడిపోతున్నారు. పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి పల్లెలకు పాకింది. మేము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే గంజాయిని కట్టడి చేశామని కూటమి పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నామమాత్రపు దాడులతో సరిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో హత్యలు కూడా జరుగుతున్నాయి. తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా గంజాయి:

జిల్లా కేంద్రమైన ఒంగోలులో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. నగరం నలుమూలలా గంజాయి గుప్పుమంటోంది. పగలు రాత్రీ తేడా లేకుండా విద్యార్థులు, యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. గంజాయి తాగి అర్ధరాత్రిళ్లు గొడవలు సృష్టించడం నిత్యకృత్యమైపోయింది. నగరంలోని గోపాల్‌ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, వెంకటేశ్వరకాలనీ, ముంగమూరు రోడ్డు చివర, కొత్తకూరగాయల మార్కెట్‌, గోపికృష్ణ థియేటర్‌ దగ్గర, బలరాం కాలనీ, అరవకాలనీ, ఇందిరమ్మ కాలనీ, వెంగముక్కలపాలెం రోడ్డు తదితర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు నగరంలోని మినీ స్టేడియం ప్రాంతంలో గంజాయి బ్యాచ్‌ చేరుతుంది. అటువైపుగా వెళ్లడానికి మహిళలు భయపడిపోతున్నారు. కొప్పోలు పరిసరాల్లో రాత్రయితే చాలు కొందరు హిజ్రాలు గంజాయి తాగి దారిలో వచ్చిపోయేవారిని వేధిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము వరకు ఈ ప్రాంతంలో గంజాయి ముఠాలు తిరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోరంట్ల ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. టీ స్టాల్స్‌లో కూర్చొని గంజాయి తాగి గొడవలకు దిగుతున్నారు. డాన్‌బాస్కో ఎదురుగా గోపాల్‌ నగర్‌ వెళ్లే చౌరస్తాలో రాత్రిళ్లు గంజాయి ముఠాలు చేరి గొడవలకు దిగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపో పరిసరాల్లో కూడా జోరుగా గంజాయి వ్యాపారం సాగుతోంది. డిపో పరిసరాల్లో 60 అడుగుల రోడ్డు, సుందరయ్య రోడ్డులో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. డిపోకు ఎక్కడెక్కడ నుంచో ప్రయాణికులు వచ్చిపోతుంటారు. దాంతో ఈ ప్రాంతాన్ని గంజాయి వ్యాపారులు అడ్డాగా చేసుకున్నట్లు సమాచారం. ఏబీఎం కాంపౌండ్లో గంజాయి బ్యాచ్‌ బెడద ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి, మద్యం తాగిన యువకులు మత్తులో ఘర్షణలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం గంజాయి బ్యాచ్‌ ఏబీఎం కాంపౌండ్‌లో విద్యార్థుల మీదకు రాళ్లు విసరగా ఒక చిన్నారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాధితులు టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాత జిల్లా పరిషత్‌ కార్యాలయం కూడా గంజాయి అడ్డాగా మారిందని చెప్పుకుంటున్నారు. సత్యనారాయణపురం, కర్నూలు రోడ్డుల్లో గంజాయి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ గుజ్జుల యలమందారెడ్డి కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఒక వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. టంగుటూరులోని రైల్వే స్టేషన్‌ వద్ద ఒక దుకాణంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టివేత

జిల్లా కేంద్రమైన ఒంగోలులో కేవలం రెండు రోజుల వ్యవధిలో 50 కిలోల గంజాయి పట్టుకోవడం పరిస్థితిని తెలియజేస్తుంది. అదికూడా నగరం నడిబొడ్డులోని అద్దంకి బస్టాండు సెంటర్లో ఒడిశా నుంచి తరలించిన 45 కిలోల గంజాయిని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అలాగే మరుసటి రోజు మరో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం గిద్దలూరులో మరో 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం బట్టి చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈనెల 14న ఒంగోలులో పట్టుబడిన 44 కేజీల గంజాయి (ఫైల్‌)

యువత చిత్తు1
1/2

యువత చిత్తు

యువత చిత్తు2
2/2

యువత చిత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement