
ఏక్ సాల్ కౌలుదారు.. ప్లాట్లేశాడు
పొదిలి: ముస్లింలకు చెందిన పెద్ద, చిన్న మసీదుల నిర్వహణకు వక్ఫ్ భూముల నుంచి వచ్చే కౌలు ఆదాయం ఆధారం. నిర్వహణతో పాటు, చిన్న పాటి మరమ్మతులకు ఆదాయంలో ఖర్చు చేస్తుంటారు. జమా ఖర్చులను కమిటీతో పాటు, ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. వక్ఫ్ భూములు రైల్వే లైన్కు అటు ఇటు సుమారు 300 ఎకరాలు ఉన్నాయి. ఏటా కౌలు వేలం నిర్వహిస్తుంటారు. వక్ఫ్ భూముల కమిటీ అధ్యక్షుడు ఇటీవల విదేశాలకు వెళ్లాడు. ఈవిషయమై సీఈఓకు సమాచారం ఇచ్చాడు. తాను మూడు నెలల పాటు అందుబాటులో ఉండటం లేదని, కమిటీ వారితో కలిసి, అధికారులు భూములు వేలం నిర్వహించుకోవాలని సూచించారు. భూముల కౌలు వేలానికి ముందుగా ప్రకటనలు ఇస్తారు. పాంప్లేట్ల ద్వారా ప్రచారం జరుగుతుంది. కమిటీ సభ్యులు, అధికారుల సమక్షంలో ఈనెల 12వ తేదీన భూములు వేశారు. మొత్తం 153 ఎకరాలకు గాను, వేలంలో 23 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో రూ.9,50,900 ఆదాయం సమకూరింది.
సర్వే నెంబర్ 820లో కిరి కిరి:
12వ తేదీన జరిగిన వేలంలో సర్వే నంబర్ 820లో రెండు ఎకరాల విస్తీర్ణానికి వేలం జరగలేదు. ఎవరూ లేక పోటీ రాలేదా, లేదా అంతకు ముందుగా వేసుకున్న పన్నాగమో కానీ మిగిలిన భూములతో పాటు వేలం జరగలేదు. కమిటీలో పదవులు ఉన్న ఇద్దరు సదరు భూమిని ఏక్సాల్ కౌలుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీనిని కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన పి.పెద్దయ్య అనే వ్యక్తికి రూ.9,200లు కౌలు నిర్ణయించి రసీదు ఇచ్చారు. వ్యవసాయం కోసమే, తాత్కాలిక పంటలను మాత్రమే కౌలుదారులు వేసుకోవాలని నిబంధనల్లో తెలియపరుస్తారు. అయితే సదరు రెండు ఎకరాలు భూమి పొందిన పెద్దయ్య ఆ భూమిలో ప్లాట్లు వేశాడు. రోడ్డు కూడా వేయించి, సెంటు రూ.20 నుంచి రూ.30 వేల ప్రకారం అమ్మకానికి సిద్ధం చేశాడు.
ఆక్రమణలకు పాల్పడితే చర్యలు:
స్థానిక నగర పంచాయతీ కమిషనర్కు ఆక్రమణల విషయమై స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన కమిషనర్ వెంటనే యంత్రాలతో రోడ్లను తొలగించారు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వక్ఫ్ భూములను కాపాడాలని స్థానిక ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్లు వేయటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులపై పలు ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన వక్ఫ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాష పొదిలికి వచ్చారు. కౌలుకు ఇచ్చిన కమిటీ వారు తనకు సమాచారం ఇవ్వలేదని, నగదు జమ చేయలేదని అహ్మద్ బాష చెప్పారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. కౌలుదారు పెద్దయ్యపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈవిషయమై ఎస్సై వేమనను వివరణ కోరగా, ఫిర్యాదు అందిన మాట వాస్తమన్నారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వక్ప్భూముల్లో రోడ్డు, ప్లాట్లు తొలగించిన కమిషనర్

ఏక్ సాల్ కౌలుదారు.. ప్లాట్లేశాడు

ఏక్ సాల్ కౌలుదారు.. ప్లాట్లేశాడు