అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలివ్వండి

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలివ్వండి

అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలివ్వండి

ఒంగోలు టౌన్‌: అరకొర జీతాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించాలని కోరుతూ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు కేవీ సుబ్బమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదాన్ని తొలగించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సుదీర్ఘ కాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అంగన్‌వాడీల పోరాటాలకు సీఐటీయూ అండగా నిలబడుతుందని తెలిపారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీల పిల్లలకు తల్లికి వందనం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి పాలకులు నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం వినతి పత్రం తీసుకునేందుకు ఐసీడీఎస్‌ పీడీ తిరస్కరించారు. దాంతో డీఆర్‌ఓ చిన ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు సుజాత, తిరుపతమ్మ, ఎల్లమ్మ, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బంకా సుబ్బారావు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement