జగన్‌పై ప్రభుత్వం కుట్రలు | - | Sakshi
Sakshi News home page

జగన్‌పై ప్రభుత్వం కుట్రలు

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

జగన్‌పై ప్రభుత్వం కుట్రలు

జగన్‌పై ప్రభుత్వం కుట్రలు

ఒంగోలు సిటీ: పల్నాడుకు వెళుతున్న జగన్‌ కారుకింద పడి సింగయ్య చనిపోయారంటూ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించారని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఒక కల్పితమైన చిన్న వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చారన్నారు. ఆ వీడియోను గమనిస్తే వాహనం కిందపడిన వ్యక్తి గురించి ఆ వాహనం వెళ్లిన తర్వాత తెలిసే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచిండండి టైర్‌ దగ్గర మాత్రమే సింగయ్య ఉన్నట్టు చూపిస్తున్నారన్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి వీడియో విడుదల చేయొచ్చుగా అని నిలదీశారు. వేలాదిగా తరలి వచ్చిన జనం నుంచి టైర్‌ కింద ఆ వ్యక్తినే ఎలా తీయగలిగారని, కేవలం 20 సెకన్ల వీడియో ఎలా వచ్చిందని, ఆ సమయంలో ఉన్న మీ సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు కాన్వాయ్‌ ముందు ఉంటుందని, అది దాటుకుని సింగయ్య ఎలా వచ్చి పడ్డారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఆ వీడియోను విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎస్పీనే అన్ని రకాలుగా విచారణ జరిపి ప్రమాదం జరిగింది జగన్‌ కాన్వాయ్‌లోని కారు కాదని చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన మీద ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి మాట మార్పించారని ధ్వజమెత్తారు. జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి బుల్లెట్‌ ప్రూఫ్‌ ఉన్న కారును నడిపేందుకు ప్రభుత్వ డ్రైవర్‌ ఉంటారన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంచి వాహనాన్ని ఇవ్వకపోతే ప్రభుత్వ అనుమతితో సొంత వాహనాన్ని కొనుగోలు చేసిన విషయం నిజం కాదా అన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వెళుతుంటే రోప్‌ పార్టీ ఉండాలి కదా అని ప్రశ్నించారు. పొదిలి, పల్నాడులకు జగన్‌ వెళ్లినపుడు జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉన్న వ్యక్తికి సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఇవ్వలేమని స్పష్టం చేయండని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టామా? రాష్ట్రమంతా అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగినా మేము ఆపామా అని అన్నారు. యువగళం పేరుతో ఎర్రబుక్‌ పట్టుకుని లోకేష్‌ తిరిగినా ఆపామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు మీరు, మీ కుమారుడు, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ కలసి స్వేచ్ఛగా తిరిగారు కదా? మీకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదా అని ప్రశ్నించారు. సింగయ్య మా పార్టీకి చెందిన వ్యక్తి.. ఆయన చనిపోవడం విచారకరం, ఆయన కుటుంబానికి మా పార్టీ అండగా నిలిచిందన్నారు. కందుకూరులో మీ ప్రచారయావకు ఎనిమిది మంది చనిపోతే ఏం ఆదుకున్నారని, మీరు అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాల్లో ఎవరికై నా ఉద్యోగాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులో చీరలు పంచుతూ ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారే వారికి ఏం న్యాయం చేశారని, గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలను, వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో చనిపోయిన వారి ఆదుకున్నారా అని నిలదీశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావా అని తాటిపర్తి ప్రశ్నించారు. నిరంకుశ పరిపాలనకు స్వస్తి పలికి ప్రజలకు మేలు చేయాలన్నారు.

ఫేక్‌ వీడియోతో అసత్య ప్రచారం 20 సెకన్ల వీడియో ఎక్కడ నుంచి వచ్చిందో బయటపెట్టాలి అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పర్యటించినప్పుడు మా ప్రభుత్వం అడ్డుకోలేదు కదా.. జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉన్న జగన్‌కు సరైన భద్రత కల్పించడంలేదు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement