
ఉచిత బస్సు అమలు చేయకపోవడం అన్యాయం
ఒంగోలు టౌన్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షురాలు జి.ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తున్న మద్యం దుకాణాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల మధ్య మత విద్వేషాలను సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవి కొండారెడ్డి విమర్శించారు. నరేంద్ర మోదీ పాలనలో గత 11 ఏళ్లలో మహిళా రక్షణ, సంక్షేమానికి సంబంధించిన అనేక చట్టాలను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఆహార భద్రత, విద్యా వైద్య సౌకర్యాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలను నిరసిస్తూ కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తొలుత సీనియర్ నాయకురాలు ఏ.రాజ్యలక్ష్మి ఐద్వా పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్.మాలతి, ఎస్కే నాగుర్, కే.రాజేశ్వరి, బి.రాజ్యలక్ష్మి, అంజనీ దేవి, పి.లక్ష్మి, జి.కళ్యాణి, విజయలక్ష్మి, రత్తమ్మ, ఇంద్రజ్యోతి, ప్రేమలత, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.