
మద్దిరాల యల్లమ్మతల్లి గుడిలో చోరీ
పీసీపల్లి: గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలు, హుండీలో కానుకలను దుండగులు కొల్లగొట్టారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి పీసీ మండలంలోని వెంగలాయపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. వెంగలాయపల్లి గ్రామంలోని మద్దిరాల యల్లమ్మతల్లి గుడిలోకి ఆదివారం అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు అమ్మవారి మూలవిగ్రహమూర్తికి అలంకరించిన 50 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలతోపాటు హుండీలోని రూ.10 వేల నగదు చోరీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్సై కోటయ్య తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో తిరునాళ్ల నిర్వహించిన వెంటనే అమ్మవారి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.