ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన టీడీపీ నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసులో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో వీరయ్య చౌదరి హత్యకు గురై మంగళవారానికి 8 రోజులు కావస్తోంది. చీమకుర్తిలో నిందితులు ఉపయోగించిన స్కూటీ దొరికిన తరువాత ఇంకేముంది..విచారణ పూర్తయినట్లేనని అంతా భావించారు. ఆ రోజంతా హడావుడిగానే సాగింది. అయితే కీలక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా పెద్దగా పురోగతి సాధించలేదు. అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువ నాయకుడు ప్రధాన అనుమానితుడిగా నిర్ధారించినట్లు ప్రచారం జరిగింది. ముంగమూరు రోడ్డులో వీరయ్య హత్య కేసులో నిందితులు ఉపయోగించిన రెండో వాహనం మోటారు బైకును స్వాధీనం చేసుకున్న తరువాత కొప్పోలుకు చెందిన ఒక వ్యక్తిని ప్రధాన పాత్రధారుడిగా పోలీసులు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఒక్కో వాహనం దొరికినప్పుడల్లా ఒకరి పేరు ప్రచారంలోకి వస్తుంది తప్పిస్తే అసలు నిందితులను పోలీసులు నిర్ధారించడంలేదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ హత్యకేసులో సూత్రధారుడిగా భావిస్తున్న వారు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పాత్రధారుడిగా చెబుతున్న వ్యక్తి కోసం వైజాగ్లో గాలిస్తున్నారు. అయితే అతను వైజాగ్లోనే ఉంటే రోజుల తరబడి గాలిస్తున్న పోలీసుల బృందం కనీసం ఒక చిన్న క్లూ కూడా సాధించలేకపోవడం గమనార్హం.
మీడియాతో మాట్లాడిన ముప్ప సురేష్
ఇదిలా ఉండగా వీరయ్య చౌదరి హత్య కేసులో మరో సూత్రధారుడిగా ప్రచారంలో ఉన్న బంగారు వ్యాపారి ముప్ప సురేష్ మంగళవారం ఓ టీవీ చానల్తో మాట్లాడడం సంచలనం సృష్టించింది. వీరయ్య చౌదరి హత్యతో తనకెలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత మీడియాలో తనపేరు రావడంతో షాక్కు గురయ్యానని చెప్పారు. రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఆయనతో ఎదురుపడిన సందర్భాలు కూడా లేవని చెప్పడమే కాకుండా తాను ఎక్కడకూ పోలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు పోలీసులు ఆయన కోసం హైదరాబాద్లో గాలిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆయన మాత్రం తానెక్కడకూ పోలేదని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో మున్ముందు విచారణలో తెలియాల్సి ఉంది. నిన్నటి వరకు అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరో నలుగురిని తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న రోజువారి విచారణ మరో నలుగురిని తీసుకొచ్చి విచారిస్తున్నట్లు ప్రచారం తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ టీవీ చానల్లో ముప్ప సురేష్