పవన్‌ లైన్‌ బీజేపీకి నచ్చడం లేదు: సజ్జల | YSRCP Leaders Serious Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘సూపర్ సిక్స్ వంద రోజుల్లోనే డకౌట్ అయింది’

Oct 4 2024 8:53 PM | Updated on Oct 4 2024 8:56 PM

YSRCP Leaders Serious Comments On Chandrababu Govt

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌ అరాచకాలు చేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ను దెబ్బకొట్టాలనే తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కాషాయం పట్టి బీజేపీ కంటే నేను ముందు ఉన్నానని చెబుతున్నాడని కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పల్నాడు లోక్‌సభ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, విడదల రజినీ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీ ఓటమి షాక్‌లా అనిపించింది. కూటమి నేతలు మోసంతోనే అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు మాయ లోకాన్ని రెండేళ్ల ముందు నుండే ప్రజలకు చూపించారు. హామీలు అమలు చేయరని తెలిసి కూడా ఓటు వేశారు. 14 లక్షలు కోట్లు అప్పు అని అసత్య ప్రచారం చేశారు. రావడం రావడమే అరాచకం, హింసా కాండ చేశారు. వైజాగ్ స్టీల్ ఏమవుతుందో తెలియదు. వైఎస్‌ జగన్ ఆనాడే చెప్పారు.. వారికి ఓటెస్తే అమ్మేసినట్లే అని. అధికారంలో ఉండి పూర్తిగా బరితెగించారు. గ్రామ కమిటీల వరకూ పక్కాగా నియామకాలు చేస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్ చేస్తాం. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సీనియర్లందరూ కలిసి కట్టుగా పని చేయాలి.

తిరుపతి ప్రసాదంపై సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టి కాయలు వేసింది. పవన్ కళ్యాణ్ కాషాయం పట్టి బీజేపీ కంటే తాను ముందు ఉన్నానని చెప్పాడు. వైఎస్‌ జగన్‌ను దెబ్బకొట్టాలనే కల్తీ ప్రసాదం అంటూ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారు. ఇంత నీచానికి దిగజారారు అంటే.. జగన్ అంటే ఎంత భయపడుతున్నాడో తెలుస్తోంది. సనాతన ధర్మానికి తానే చాంపియన్ పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ బీజేపీ పెద్దలకు నచ్చటం లేదు. దీన్ని బట్టే వీరెంత కాలం కలిసుంటారో తెలియడం లేదు. వాళ్లలో వాళ్ళే కొట్టుకునేట్లున్నారు. దీంతో ప్రజలకు మరిన్ని సమస్యలు రానున్నాయి.

మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘పదవిగా కాదు బాధ్యతగా భావిస్తున్నాం. గెలుపు వైపునకు తొలి అడుగు ఇక్కడ నుండే పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం. పదవులు వస్తాయి పోతాయి. రేపల్లెలో పుట్టా, సత్తెనపల్లిలో పెరిగా గుంటూరు వచ్చాను. లోకేష్ రెడ్ బుక్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు. నేను గ్రీన్ బుక్ పెట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త పేరు రాసుకుంటాం. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడిలా మండే శక్తి ఉండాలి. వైఎస్‌ జగన్‌కు అటువంటి శక్తి ఉంది. కార్యకర్తలకు రుణపడి ఉంటాం. నేను, అంబటి రాంబాబు రామలక్ష్మణులు వంటి వాళ్లం. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు సిట్ వేసింది. చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలి. బలహీన వర్గాలకు ఆ పదవి అప్పగించాలి. సీబీఐ నుండి ఇద్దరిని, రాష్ట్రం నుండి ఇద్దరిని సిట్‌లో నియమించారు. సిట్ విచారణ సక్రమంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదు

మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..టీడీపీని ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అంబటి, మోదుగుల నాయకత్వంలో ముందుకెళుతాం. అంబటిని అధ్యక్షుడిగా నియమించడం శుభపరిణామం.

మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న అంబటి రాంబాబు, మోదుగులకు శుభాకాంక్షలు. జగనన్నే మన ధైర్యం జగనన్న పాలన అంటే గుర్తుకొచ్చేది సంక్షేమం. బెంచ్ పార్క్ పాలన అందించాం. విద్య, వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది. జగనన్న మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. సూపర్ సిక్స్ వంద రోజుల్లోనే డకౌట్ అయింది అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ప్రజాబలం ఎవరికి ఉందో ఈవీఎం బ్యాచ్‌కు తెలుసు: పేర్ని నాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement