
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని.
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ
ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.
‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు.
చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.

అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.
ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.