తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రయోగం చేపట్టింది. పేరు ఓట్ స్వీటెన్డ్ కేరళ క్యాంపెన్. ఇందులో భాగంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా ప్యాకెట్లు అందజేశారు. ఇందుకుగాను, ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా ప్యాకెట్లను అందజేస్తారు.
ఏఏ బూత్లలో వీటిని ఫస్ట్ టైం ఓటర్లకు అందజేయాల్సిందీ జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించి, ఆ మేరకు ఆయా బూత్లకు పంపిణీ చేయనున్నారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని ఈసీ తెలిపింది.
కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.


