తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. రెండేళ్లలో రైతులకు చెప్పుకోదగ్గ ఒక్క మేలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.
ఈరోజు(శనివారం, మే 9 వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కైలే అనిల్ కుమార్.. ‘ మోంథా తుపానుకు నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి సింగపూర్లో విహరిస్తున్నారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి?, ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు.
ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పంటల బీమా లేదు. చంద్రబాబు ఏడుసార్లు ఇప్పటివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి ఏం సాధించారు?, ఒక్క సమావేశంలోనైనా రైతుల గురించి చర్చించారా?, జగన్ తెచ్చిన వ్యవస్థల పేర్లు మార్పు కోసమే సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు.


