‘కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారు’ | YSRCP Leader Ambati Rambabu Chandrababu Duel Game | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారు’

May 29 2026 7:20 PM | Updated on May 29 2026 7:33 PM

YSRCP Leader Ambati Rambabu Chandrababu Duel Game

తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌ అని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్‌తో ఉంటున్నారని అం‍బటి విమర్శించారు.  కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. 

ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంగ్రెస్‌ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్‌ పార్టీ బీ టీమ్‌. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ బీ టీమ్‌. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్‌ చేస్తుంది.  రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు‌ సంకేతం. 

చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. 

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. 

కేఎన్నార్ మీద ఎల్లోమీడియా నీచపు రాతలు రాస్తోంది. చంద్రబాబు ఆస్తి రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారు?, సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడవి?, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ, కిరణ్ లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?, వైఎస్ఆర్ సీపీని తొక్కేయటం ఎవరితరం కాదు. మా ఇంటి మీద దాడి, విధ్వంసం  చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు?, త్వరలోనే మళ్ళీ నా పోరాటం ప్రారంభిస్తా. మా‌ ఇంటి నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వస్తా. 29 కిలోమీటర్లు 'వినతి పాదయాత్ర' చేస్తా’ అని పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement