కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. బరాసత్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాజకీయ కన్సల్టెన్సీ ఐపాక్పై దస్తిదార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర నేతలతో కూడా దూరం పెరిగింది. దీనితో తాత్కాలికంగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉండాలని మమతా ఆదేశాలు జారీ చేశారు.
అయినప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన పరిపాలనా సమీక్ష సమావేశానికి దస్తిదార్ హాజరయ్యారు. పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆమె పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో బుధవారం దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్లోని జిల్లా అధ్యక్షురాలు పదవి, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల పరాజయాల తరువాత పలువురు నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తోంది.


