హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రెస్మీట్లో మాట్లాడారు.
దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.
మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు... ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.
రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు.


