
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా మహిళల హక్కుల కోసం కల్వకుంట్ల కవిత ఏనాడూ గళమెత్తిన దాఖలాలు లేవని తెలంగాణ ఉద్యమకారిణి ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోరుతూ జంతర్ మంతర్లో దీక్షకు చేపడతానని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లే అవకాశం ఉండడంతో అకస్మాత్తుగా మహిళలు గుర్తుకు రావడం విచిత్రంగా ఉందని ఇందిరా శోభన్ గురువారం ఇక్కడ ఓ ప్రకటనలో విమర్శించారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయ డ్రామా, అధికార యావ తప్ప వేరే ఏమీ లేదని నిందించారు. జనాభాలో సగభాగమున్న మహిళలకు 33 శాతం కాకుండా 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు.