ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆది శ్రీనివాస్కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.


