
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ముఖం చూపించే ధైర్యం లేకే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటన అంటూ పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మోదీకి కాదు.. ప్రధాని పదవికి, స్థానానికి గౌరవం ఇవ్వాలని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు ప్రధానిని ఇష్టమొచ్చినట్టు తూలనాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ఇక్కడి ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్, హరియాణాల పర్యటనకు వెళ్లారని దుయ్యబట్టారు. శనివారం ఈటల విలేకరులతో మాట్లాడుతూ గతంలో జాతీయ రాజకీయాల్లో వేలుపెట్టిన ఎన్టీఆర్, చంద్రబాబుల పరిస్థితి ఏమైందో ప్రజలు చూశా రని, చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు కూడా పట్టనుందన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.74 వేల కోట్లు ఉన్న అప్పు కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు.