సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల నాటికి రాజధాని నగరం హైదరాబాద్, నగరాన్ని ఆనుకొని ఉన్న ఇరుగుపొరుగు జిల్లాల్లో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునరి్వభజన చేసేందుకు నిర్ణయించడంతోపాటు 50 శాతం స్థానాలను పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి.
ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి. శాసనసభా నియోజకవర్గాలు, లోక్సభ స్థానాలు 50 శాతం పెరగనుండటంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 183కి పెరగనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2011 జనగణన మేరకు రాష్ట్రంలోని జనాభా దాదాపు 3.52 కోట్లు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ జనాభా సగటున దాదాపుగా 1.93 లక్షలు. దీనికి పది శాతం అటూఇటూ ఉండేలా పునర్విభజన జరగవచ్చు. హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగనున్నాయి.
జిల్లాల వారీగా పెరిగేదిలా..
2011 లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323. ఒక్కో అసెంబ్లీకి సగటుజనాభా 1.93 లక్షలను పరిగణనలోకి తీసుకుంటే ఈ జిల్లాలో 20 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 15 శాసనసభా స్థానాలకు తోడు కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయన్న మాట. అలాగే మేడ్చల్ జిల్లా జనాభా 24,60,095. ఈ లెక్కన ఈ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు అదనంగా మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి.
రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,265. ఈ లెక్కన ఈ జిల్లాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ (కల్వకుర్తి పాక్షికం) నియోజకవర్గాలకు అదనంగా మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. ఇదే లెక్కన వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఆవిర్భవిస్తాయి.
ఐదు జిల్లాల పరిధిలో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలతో పునరి్వభజన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న 63 శాసనసభ నియోజకవర్గాల్లో 22 ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. అంటే మూడో వంతుకు పైగా ఇక్కడే ఏర్పడనున్నాయి. ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండటంతో పాటు జీహెచ్ఎంసీకి ఒక సర్కిల్ లేదా జోన్ సైతం ఒకే జిల్లాలో జీహెచ్ఎంసీ పునరి్వభజన సందర్భంగానూ అధికారులు జాగ్రత్త వహించారు.
కొత్త నియోజకవర్గాల్లో కొన్ని?
ప్రస్తుతం ఆయా ప్రాంతాలకున్న ప్రాధాన్యం, వాడుక దృష్ట్యా కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హిమాయత్నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ (ఐడీపీఎల్) పేరిట ఏర్పాటు కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అవి ఏ నియోజకవర్గంలో ఉన్నాయో, ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, పక్కపక్కనే ఉండే రెండు ముఖ్య ప్రాంతాల పేర్లు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉండవని చెబుతున్న వారూ ఉన్నారు.


