అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్ చౌదరి ఘాటుగా ఆరోపణలు చేశారు.
‘గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ త్యాగం చేశాను. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నా వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అణచివేత కు పాల్పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూకబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలన్నీ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయను. డీలిమిటేషన్ జరిగితే... మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం’ అని స్సష్టం చేశారు.


