ఉత్తర బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్తో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు, ఇవాళ దక్షిణ బెంగాల్లో రెండో విడతతో మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 142 నియోజకవర్గాల్లో 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విడతలో భవానీపూర్ పోరు ప్రత్యేక ఆకర్షణ. మమతా బెనర్జీ (TMC) మరియు సువేందు అధికారి (BJP) మధ్య జరుగుతున్న ఈ పోటీ కేవలం ఒక నియోజకవర్గం పోరాటం కాదు. అది బెంగాల్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రతీకాత్మక యుద్ధంగా మారింది.
సంక్షేమం Vs పరివర్తనం..
ఇదే ఈ విడతలో ప్రధాన నినాదం. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలతో గ్రామీణ మహిళల మద్దతు పొందుతుండగా బీజేపీ “మార్పు” వాగ్దానంతో ముందుకు వస్తోంది. మరోవైపు సర్ సమస్య (ఓటర్ల పేర్లు తొలగింపు) ప్రజల్లో ఆందోళన కలిగించి, అధిక ఓటర్ల హాజరుకు దారితీస్తోంది. కోల్కతా, హౌరా, హుగ్లీ, నాదియా, బర్దమాన్ జిల్లాల్లో కీలక పోటీలు జరుగుతున్నాయి. టీఎంసీ మంత్రులు తమ స్థానాలను కాపాడుకోవడానికి పోటీ పడుతుండగా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 41,000కి పైగా పోలింగ్ కేంద్రాల్లో CAPF బలగాలు మోహరించబడ్డాయి. సున్నితమైన బూత్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. తొలి విడతలో 93% పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, రెండో విడతలో కూడా అధిక హాజరు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మౌనంగా ఉన్నా, వారి ఓటు నిర్ణయం ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. మొత్తంగా, ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్, బెంగాల్ ఎన్నికల తుది ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. “ఏలేదెవరు? కూలెదెవరు?” అన్న ప్రశ్నకు సమాధానం దిశగా ప్రజాస్వామ్య యాత్ర కొనసాగుతోంది.


