అవసరమైతే ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం: రాజ్‌గోపాల్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ | Ready To Fight With Government For Munugodu Rajgopal Reddy | Sakshi
Sakshi News home page

అవసరమైతే ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం: రాజ్‌గోపాల్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌

Sep 7 2025 8:29 PM | Updated on Sep 7 2025 8:49 PM

Ready To Fight With Government For Munugodu Rajgopal Reddy

తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తోంది.  తమ పార్టీలోని సొంత నాయకులపైనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్‌ఎస్‌లో కవిత చేసిన కామెంట్స్‌తో ఆ పార్టీకి చెందిన నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. 

ఇక కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెలయే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌. పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. తనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పటివరకూ తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది నిన్న మొన్నటి వరకూ రాజ్‌గోపాల్‌రెడ్డి నుంచి వచ్చిన మాట. ఇప్పుడు అదే రాజ్‌గోపాల్‌రెడ్డి పదవి కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తానంటున్నారు. కాకపోతే మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.  దీనిలో భాగంగా  ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధం.  మునుగోడు కోసం ఎంత త్యాగమైనా చేస్తా. ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఎదురుచూస్తా’ అని పేర్కొన్నారు. 

ఒకవైపు మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తానని, అదే సమయంలో తన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానంటూ సంయమనంతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌ పెద్దల్ని ఆలోచనలో పడేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మునుగోడు ప్రజల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని, అవసరమై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమనే వ్యాఖ్యలు మరోసారి హీట్‌ పుట్టించేవిగా ఉన్నాయని, రాజ్‌గోపాల్‌రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శమనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. 

Advertisement
 
Advertisement
Advertisement