సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం.
గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా.. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది.
మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే. జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది.

నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ
తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారుప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు..
పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు
జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారు
చదువు లేకపోవడం వెనుకబాటుతనం
భూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది.ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
కులవివక్షను రూపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం.
రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం.
తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు. పిల్లల భవిష్యత్ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండి
విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి. నిబద్ధతతో నిరంతరం కష్టపడండి.. తప్పకుండా ఫలితం వస్తుంది.మీరంతా డాక్టర్లు లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని’ ఆకాంక్షించారు


