భారత్‌ న్యాయయాత్ర.. రాహుల్‌ మళ్లీ పాదయాత్ర | Rahul Gandhi Bharat Nyay Yatra From 'Manipur to Mumbai': Details Here | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌: మణిపూర్‌ నుంచి ముంబై దాకా రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయయాత్ర’

Dec 27 2023 11:04 AM | Updated on Dec 27 2023 11:55 AM

Rahul Gandhi Bharat Nyay Yatra from Manipur to Mumbai Details here - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత ఈసారి ఈశాన్యం నుంచి పశ్చిమం వైపు 6,200 కిలోమీటర్లు యాత్ర.. 

ఢిల్లీ, సాక్షి:  కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్‌ న్యాయయాత్ర పేరుతో రాహుల్‌ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో తెలిపారు. 

రెండో విడతలో.. ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్‌ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్‌లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది.  అయితే ఈసారి యాత్రకు భారత్‌ జోడో యాత్ర అని కాకుండా.. భారత్‌ న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు తెలిపారాయన.

రాహుల్‌ యాత్ర ఈసారి హైబ్రీడ్‌ మోడల్‌లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా రాహుల్‌ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్‌ స్పష్టత ఇచ్చారు. భారత్‌ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్‌ భారత్‌ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్‌ ముఖాముఖి అవుతారని వెల్లడించారు.

జోడో యాత్ర సాగిందిలా.. 
బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకేనని రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ‘మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్‌ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా.. 12 రాష్ట్రాల్లో సాగింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు దాదాపు 3970 కి.మీ మేర రాహుల్‌ యాత్ర కొనసాగించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement