మణిపూర్ టు ముంబయి: మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం | Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Begins Updates | Sakshi
Sakshi News home page

మణిపూర్ టు ముంబయి: మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

Jan 14 2024 7:54 AM | Updated on Jan 14 2024 12:33 PM

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Begins Updates - Sakshi

ఇంఫాల్: 

మణిపూర్‌లోని  తౌభాల్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు.

అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వాన్ని ఎలుగెత్తడమే ఈ యాత్ర ధ‍్యేయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'కు హాజరవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు కీలక నాయకులు బయలుదేరారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మణిపూర్‌కు వెళుతున్నారు.

► కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్‌ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను..  మార్చి 20 లేదా 21న ముంబయిలో యాత్రను ముగించనున్నారు.  

మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. 

అయితే, తొలి దశలో జరిగిన భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. 

కాగా  గతంలో రాహుల్‌  భారత్‌ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది.

ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!

Advertisement
 
Advertisement
Advertisement