ముఖ్యమంత్రి ఇలాకాలో.. ఐసీయూలో కాల్పుల కలకలం | Prisoner on parole attacked at Patna Paras Hospital | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ఇలాకాలో.. ఐసీయూలో కాల్పుల కలకలం

Jul 17 2025 4:41 PM | Updated on Jul 17 2025 5:45 PM

Prisoner on parole attacked at Patna Paras Hospital

పాట్నా: బీహార్‌లో క్రైమ్‌ సినిమా సీన్‌ను తలపించేలా ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు నిందితులు తాపీగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఐసీయూలో చొరపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని కాల్చి చంపారు. 

గురువారం పాట్నాలోని రాజాబజార్‌ పారస్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న చందన్ మిశ్రా.. ప్రస్తుతం పేరోల్‌ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా పారస్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా చందన్‌ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకే చందన్ షేరు గ్యాంగ్‌ ప్రాణాలు తీసినట్లు పాట్నా ఎస్‌ఎస్‌పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు.

మరోవైపు, పట్టపగలే నిందితులు ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్‌ మిశ్రా హత్య వెనుక ఆస్పత్రి వర్గాల ప్రమేయో కూడా ఉండొచన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు, యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని ఆచూకీ గుర్తించేందుకు పాట్నా పోలీసులు.. బక్సర్‌ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వారి గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎం నితీష్‌ కుమార్‌ నివాసానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది.  పరాస్‌ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వ అడంతో నేరస్తులే ఆస్పత్రి ఐసీయూలోకి చొరబడి రోగిని కాల్చి చంపారు.బీహార్‌లో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005 కి ముందు ఇది జరిగిందా? అని నితిష్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 

కాగా, ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం నితిష్‌ కుమార్‌ ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే, బీహార్‌లో వరుస హత్యలతో శాంతి భద్రతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో  ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్‌ చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement