ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై క్యాబినెట్ సమీక్ష జరుపుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, దాని ఆర్థిక ప్రభావాలపై చర్చ జరుగుతోంది. వివిధ మంత్రిత్వ శాఖల మంత్రుల పనితీరు, నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమావేశంలో చర్చిస్తున్నారు. క్యాబిబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియా ఘర్షణ, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్న విషయం గురువారం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ చమురు ధరలు, ఇంధన సరఫరా వ్యవస్థ, ద్రవ్యోల్బణ పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
“ముడి చమురు, ఇంధనం, ఎల్పీజీకి సంబంధించి ఇప్పటికీ తగిన నిల్వలు ఉన్నాయి. ప్రత్యేకంగా సమస్య ఏదీ లేదు” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే తెలిపారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత పరిస్థితిని ప్రధాని మోదీ నేరుగా ఆయా అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
క్యాబినెట్ మార్పుల ఊహాగానాలు
క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై చర్చలు వేగం పుంజుకున్నాయని గత వారం సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జూన్ రెండో వారంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో మంత్రిత్వ శాఖల పనితీరు, వ్యవస్థాపక నిర్వహణపై మోదీ, అమిత్ షా సమీక్షిస్తున్నారు.


