
సాక్షి, హైదరాబాద్: టైమ్ ఎప్పుడు వస్తుందా?. సీఎం రేవంత్ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత గల సీఎం దొరకడం కష్టమని.. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతా వారికి వసూల్ చేయడం రాదన్నారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతోందంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ.. రేవంతే ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఉండి తీరతారంటూ తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. ‘‘మా పార్టీలో అందరూ సమర్థులే. అరవింద్ ఏ సందర్భంగా మాట్లాడారో తెలియదు. నాకు అరవింద్ చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టే నా గురించి అలా అన్నాడేమో. మా పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అంతిమ నిర్ణయం అధిష్టానానిదే’’ అంటూ శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
‘‘సచివాలయంలో మీనాక్షీ నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు. ఆమె మమ్మల్ని కలవడానికి సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి ఎవరైనా రావచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా సచివాలయానికి వస్తారు’’ అని శ్రీధర్బాబు చెప్పుకొచ్చారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాధ్యతాయుతంగా పని చేయాలని మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని, మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు విరోధులగా మారారు. హెచ్యూసీ ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింక పిల్లను హెచ్సీయూలో చనిపోయినట్లు చూపించారు. ఏనుగులు హెచ్సీయూ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా చూపించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు’’ అని శ్రీధర్బాబు ధ్వజమెత్తారు.
