
చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పుడు ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆరిపోయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడు.. ఆయన జీవితం గురించి ‘ఐటీడీపీ’కి తెలియనట్టుంది. ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలీదా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
‘‘2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 12 సిలెండర్లు ఇస్తానన్నారు. సబ్సిడీ కూడా ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు?. 14,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నిలువునా మోసం చేశారు. హైస్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. మొదటి సంతకం చేసిన బెల్టుషాపులు కూడా ఎత్తి వేయలేదు. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారు. ఇప్పుడు కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా చంద్రబాబూ?’’ అంటూ జోగి రమేష్ దుయ్యబట్టారు.
చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
‘‘పేదలను ధనవంతులు చేస్తాడంట. పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే అడ్డుకుని కోర్టులకు వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ధనవంతులను ఎలా చేస్తారు?. మాట ఇస్తే ఎందాకైనా పోరాటం చేసే వ్యక్తి జగన్. ఆయన్ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. భోగాపురం ఎయిర్ పోర్టు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదీ ప్రజల మీద జగన్కి ఉన్న ప్రేమ. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నది చంద్రబాబు’’ అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.