
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఉన్న పాలకులకు దార్శనికత లేకపోవడంతో సహజ వనరులు, మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకోలేక పోతున్నారని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపేందుకు పాలకులు విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పారు.
కులమతాలను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకునేలా ప్రజల్లో చైతన్యం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, నాయకులు గురువారం ప్రగతిభవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో పుణే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్టీ సావంత్, దక్షిణ ముంబై ఎన్సీపీ అధ్యక్షుడు మానవ్ వెంకటేశ్, సీబీఐ రిటైర్డ్ అధికారి లక్ష్మణ రాజ్ సనప్, జెడ్పీ సభ్యుడు భగవాన్ సనప్, మహారాష్ట్ర ఎంబీటీ అధ్యక్షుడు అజర్ అహ్మద్ తదితరులున్నారు.
ఇటీవలి పండరీపూర్, సోలాపూర్లో పర్యటన తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎదుగుదల వేగవంతమైందని, దీంతో అక్కడి పార్టీలకు భయం పట్టుకుందని ఆయా నేతలు చెప్పారు. చేరికల కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బీబీ పాటిల్ తదితరులున్నారు.