బీజేపీ మూడో జాబితా విడుదల.. 146 మంది అభ్యర్థుల ఖరారు | Maharashtra Assembly polls: BJP releases third list of 25 candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ మూడో జాబితా విడుదల.. 146 మంది అభ్యర్థుల ఖరారు

Oct 28 2024 6:54 PM | Updated on Oct 29 2024 10:41 AM

Maharashtra Assembly polls: BJP releases third list of 25 candidates

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. దీంతోపాటు నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు అభ్యర్థిని కూడా ప్రకటించింది.

ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడిగా అనేక సంవత్సరాలు పనిచేసిన సుమిత్ వాంఖడే బరిలోకి దిన్నారు. 2019లోనూ ఫడ్నవీస్ మాజీ పీఏ అభిమన్యు పవార్‌కు అవుసా నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు.

ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ముంబై వెస్ట్‌లోని వెర్సోవా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్,  లాతూర్ సిటీ నుంచి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్,  పాల్ఘర్ జిల్లాలోని వాసాయి స్థానం నుంచి స్నేహ దుబే, వాషిమ్‌లోని కరంజా నుంచి సాయి ప్రకాష్ దహకే ఉన్నారు.

ఘట్‌కోపర్‌ ఈస్ట్‌ నుంచి పరాగ్‌ షా, బోరివాలి నుంచి సంజయ్‌ ఉపాధ్యాయ్‌ను ముంబై నుంచి పోటీకి నిలిపింది. కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై స్థానిక నేత అవినాష్ బ్రహ్మాంకర్‌ను బీజేపీ బరిలోకి దించింది. అస్తి స్థానం నుంచి సురేష్ ధాస్, మల్షిరాస్‌ నుంచి సత్పుటే, డెగ్లూర్ నుంచి జితేష్ అంతపుర్కర్, సావ్నర్ నుంచి ఆశిష్ దేశ్ ముఖ్ వంటి ప్రముఖ నేతలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గత వారం విడుదల చేసిన తొలి జాబితాలో అత్యధికంగా 99 మంది అభ్యర్థులున్నారు. శనివారం రెండో జాబితాలో 22 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. తాజా వాటితో కలిపి మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 23న జార్ఖండ్‌తోపాటు కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

మహారాష్ట్రలో "మహా" సమరం .. బీజేపీ మూడో జాబితా విడుదల

Advertisement
 
Advertisement
Advertisement