రెండు పడవలపై రేవంత్‌ ప్రయాణం! | Kommineni Analysis On Revanth Reddy Speech In Sr NTR Statue Unveiling Ceremony In Telangana, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

రెండు పడవలపై రేవంత్‌ ప్రయాణం!

Jun 2 2026 11:11 AM | Updated on Jun 2 2026 11:44 AM

Kommineni Analysis on Revanth Speech in NTR Statue Unveiling Ceremony

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్‌ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్‌కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ  చేసిన  సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన  తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.

తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను  పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.

కాంగ్రెస్‌పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌కు ఎలా స్పూర్తి అవుతారు?  కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్‌ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు  కదా! అంటే  ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?

అంబేద్కర్‌ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి   ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్‌ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.

తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన  హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.

అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్‌కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు.  ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప  ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్‌ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్‌లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో  విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్  ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్‌, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఒక హార్స్  పవర్‌కు   ఏభై  రూపాయలకే  రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.

ఎన్టీఆర్‌ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్‌కు ఏమి సంబంధం. వైఎస్సార్‌ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్‌ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్‌ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన  ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.

బహుశా సోనియాగాంధీ ఆయన అంటే  పడదు  కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్‌కు ఉండగా, ఎన్టీఆర్‌ పేరును  అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్‌లోకి వచ్చాక ఎన్టీఆర్‌ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్‌ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.

కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన  ఒక్కరే అంటే  మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం  ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా  కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.

ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే,  విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్‌తో పోల్చి రేవంత్‌ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.

అలాగే కాంగ్రెస్‌ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే  అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్‌కు పడి ఉండవచ్చు. కాని  భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ  మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే  రేవంత్‌రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement